సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!

- August 06, 2026 , by Maagulf
సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!

అబుదాబి:  పిల్లల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకునే తల్లిదండ్రులకు అబుదాబి కోర్టు కీలక హెచ్చరిక జారీ చేసింది. పిల్లల గోప్యత, భద్రతకు భంగం కలిగించేలా ఆన్‌లైన్‌లో వారి వివరాలను ప్రచారం చేయకూడదని ఆదేశిస్తూ, ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తొలగించాలని విడాకులు తీసుకున్న ఓ దంపతులకు అబుదాబి సివిల్ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. పిల్లల ప్రయోజనాలకు హాని కలిగించే కంటెంట్‌ను తొలగించాలని, పరస్పర అనుమతి లేకుండా పిల్లల పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది.యూఏఈలోని వదీమా చైల్డ్ రైట్స్ లా ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. 

తల్లిదండ్రుల మధ్య వివాదాల కంటే పిల్లల గోప్యత, సంక్షేమమే ముఖ్యమని కోర్టు పేర్కొంది.
ఈ తీర్పు గురించి న్యాయ నిపుణులు మాట్లాడుతూ..  యూఏఈ కోర్టు తొలిసారిగా ఇద్దరు తల్లిదండ్రులకూ పిల్లల ఫొటోలు, వీడియోలను ప్రచారం చేయకుండా ఆదేశించడం ఇదే మొదటి కేసు అని తెలిపారు. ఈ తీర్పు తల్లిదండ్రుల మధ్య ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే అంశంపై కాకుండా పిల్లల హక్కుల పరిరక్షణపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఈ కేసులో తండ్రి మొదట తన మాజీ భార్య పిల్లల ఫొటోలను డిజిటల్ వేదికలపై, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే తల్లి కూడా తండ్రి పిల్లలకు సంబంధించిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారని వాదించారు. దీంతో కోర్టు ఒకరికి అనుకూలంగా కాకుండా, ఇద్దరు తల్లిదండ్రులు పిల్లల గోప్యతను పూర్తిగా కాపాడలేకపోయారని గుర్తించి, ఇద్దరికీ సమాన ఆదేశాలు జారీ చేసింది.

పిల్లల ఫొటోలు, వీడియోల ప్రచురణ వాణిజ్యపరమైనదైనా, సాధారణమైనదైనా వారి ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే, బాధిత తల్లిదండ్రులు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని, అప్పుడు జైలు శిక్ష లేదా ఉమ్మడి సంరక్షణ హక్కు (జాయింట్ కస్టడీ) కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించింది.

 పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టే ప్రతి తల్లిదండ్రి ఈ తీర్పును గమనించాలని న్యాయ నిపుణులు సూచించారు. పిల్లలకు సంబంధించిన ఏ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో పంచుకునే ముందు మరో తల్లిదండ్రి అనుమతి తీసుకోవాలని, పిల్లల పేర్లతో ఖాతాలు ప్రారంభించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పిల్లలు పెద్దయ్యాక కూడా తమ చిన్ననాటి పోస్టులను చూసి ఇబ్బంది పడకుండా, తల్లిదండ్రులు సోషల్ మీడియా వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలని  సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com