టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- March 28, 2026
న్యూ ఢిల్లీ: దేశంలోని టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్ (TRP) వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ‘టీవీ రేటింగ్స్ పాలసీ 2026’ను శుక్రవారం ఆవిష్కరించింది. 2014 నాటి పాత మార్గదర్శకాల స్థానంలో వచ్చిన ఈ కొత్త విధానం, రేటింగ్స్ ప్రక్రియలో పారదర్శకత, స్వాతంత్య్రం, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ రంగంలో కొన్ని సంస్థల గుత్తాధిపత్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశ నిబంధనలను భారీగా సడలించింది.గతంలో టీవీ రేటింగ్ ఏజెన్సీని ప్రారంభించాలంటే రూ.20 కోట్ల నికర విలువ ఉండాలి. ఇప్పుడు దానిని రూ.5 కోట్లకు తగ్గించారు.దీనివల్ల కొత్త సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించి ఆరోగ్యకరమైన పోటీని ఇచ్చే అవకాశం ఉంటుంది.
రేటింగ్ ఏజెన్సీలు ఎవరికీ కొమ్ముకాయకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి:ఏజెన్సీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో కనీసం 50% మంది బ్రాడ్కాస్టర్లు లేదా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలతో సంబంధం లేని స్వతంత్రులుగా ఉండాలి.రేటింగ్ ఇచ్చే ఏజెన్సీలు ఇతర కన్సల్టెన్సీ పనులు చేపట్టకూడదు. దీనివల్ల ప్రయోజనాల సంఘర్షణ (Conflict of Interest) తలెత్తదు.
శాంపిల్ సైజ్ పెంపు–డేటా కచ్చితత్వం
డేటా కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు, శ్యాంపిల్ సైజును భారీగా పెంచాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు ఆరు నెలల్లోగా, కొత్తగా వచ్చేవి 18 నెలల్లోగా తమ మీటర్డ్ ఇళ్ల సంఖ్యను 80,000కు పెంచాలి. భవిష్యత్తులో ఈ సంఖ్యను 1,20,000 ఇళ్లకు విస్తరించనున్నారు. అంతేకాకుండా, కేబుల్, డీటీహెచ్, ఓటీటీ ప్లాట్ఫామ్లు, కనెక్టెడ్ టీవీలతో సహా అన్ని మాధ్యమాల్లో వీక్షకుల డేటాను సేకరించేలా సాంకేతికతతో సంబంధం లేకుండా ఈ వ్యవస్థను రూపొందించారు.పారదర్శకతకు పెద్దపీట వేస్తూ,రేటింగ్ ఏజెన్సీలు తాము అనుసరించే పద్ధతులను, అనామక డేటాను తమ వెబ్సైట్లలో ప్రచురించాలని ఆదేశించారు. అదే సమయంలో, వీక్షకుల వ్యక్తిగత సమాచార భద్రత కోసం ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023’కు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. జవాబుదారీతనాన్ని పెంచేందుకు ద్వంద్వ ఆడిట్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
దీని ప్రకారం త్రైమాసిక అంతర్గత ఆడిట్లు, వార్షిక బాహ్య ఆడిట్లు నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు మంత్రిత్వ శాఖ ఒక ‘ఆడిట్ అండ్ ఓవర్సైట్ టీమ్’ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ మార్పులతో బ్రాడ్కాస్టింగ్ రంగంలో విశ్వసనీయమైన, పారదర్శకమైన వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ









