ఐపీఎల్ బెట్టింగ్‌ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

- March 28, 2026 , by Maagulf
ఐపీఎల్ బెట్టింగ్‌ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్: ఐపీఎల్ సీజన్-19 కోలాహలం మొదలైన నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు మరియు యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. క్రికెట్‌ను కేవలం ఒక ఉల్లాసభరితమైన క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని, ఉత్సాహంలో పడి బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు. గతంలో బెట్టింగ్‌లపై కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ నిర్వహించే ముఠాలు చురుగ్గా మారుతున్నాయని, యువతను ఆకర్షించేందుకు రకరకాల మార్గాలను వాడుతున్నారని సీపీ పేర్కొన్నారు. కేవలం బెట్టింగ్ నిర్వహించే వారే కాకుండా, డబ్బు ఆశతో ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే వారిపై కూడా పోలీసులు నిఘా ఉంచారని, అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

బెట్టింగ్ వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని, కాబట్టి యువత తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సజ్జనార్ హితవు పలికారు. మీ చుట్టుపక్కల ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిసినా లేదా ఆన్‌లైన్ బెట్టింగ్ లింకుల గురించి సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100 లేదా 94906 16555 అనే ప్రత్యేక నంబర్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com