ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’

- March 28, 2026 , by Maagulf
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’

హైదరాబాద్: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026 అత్యంత వైభవంగా జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఉద్యమానికి మద్దతుగా సినీ, రాజకీయ, కార్పొరేట్ రంగాల ప్రముఖులు ఒకే తాటిపైకి వచ్చారు. ప్రీమియర్ ఎనర్జీస్ సమర్పణలో జరిగిన ఈ వేడుక, విద్యారంగంలో సామాజిక మార్పు తీసుకురావడానికి భాగస్వామ్యాల ప్రాముఖ్యతను చాటిచెప్పింది.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఫ్యాషన్ షోలో భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు విద్యా సేవ కోసం ర్యాంప్ వాక్ చేశారు. జయప్రద, సుహాసిని వంటి సీనియర్ నటీమణులతో పాటు లక్ష్మీ మంచు, పాయల్ రాజ్‌పుట్, ఫరియా అబ్దుల్లా, సీరత్ కపూర్, హెబ్బా పటేల్, ప్రియదర్శి, నిఖిల్ విజయేంద్ర సింహ వంటి యువ తారలు రామ్జ్ డిజైన్ చేసిన ప్రత్యేక వస్త్రధారణలో మెరిశారు.

ఈ ప్రదర్శన కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, వెనుకబడిన వర్గాల పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక సామాజిక లక్ష్యంతో సాగింది. టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థను 2014లో స్థాపించిన లక్ష్మీ మంచు, గత పదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఉపాధ్యాయ శిక్షణ, వాలంటీర్ కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు మూడు లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ సంస్థ అండగా నిలిచింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 1,500కు పైగా పాఠశాలల్లో ఈ సంస్థ సేవలు విస్తరించాయి. ప్రతి చిన్నారికి వారి సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా విద్య అందాలన్నదే తన లక్ష్యమని లక్ష్మీ మంచు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నవోటెల్ హైదరాబాద్ వంటి భాగస్వాముల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని, ప్రతి ఒక్కరూ ఈ సామాజిక ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com