TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- March 31, 2026
డాలస్, టెక్సస్: తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఐదున్నర సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. “తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఎవరేం చేస్తున్నారు?” అనే అంశంపై ఆదివారం జరిగిన 90వ అంతర్జాల సమావేశం చాలా విజయవంతంగా జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య డా.యార్లగడ్డ లక్షీప్రసాద్ ప్రముఖ కవి, మానవతావాది ఆలూరి బైరాగి వివిధ రకాల అంశాలపై ఎంతో సామాజిక స్పృహతో రచించిన విలువైన సాహిత్యం పై సమగ్ర విశ్లేషణ చేసి, బైరాగి తెలుగు సాహిత్యం మొత్తాన్ని సేకరించి పుస్తక రూపంలోను, ఇ-బుక్ రూపంలో కూడా త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నానన్నారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ శరత్ చంద్ర (ఆర్.డి విల్సన్) మాట్లాడుతూ ఒకప్పుడు ప్రసిద్ధిగాంచిన వార, పక్ష, మాస పత్రికలు అన్నీ పాఠకుల ఆదరణ లేదన్న కారణంగా కనుమరుగవుతున్న కాలంలో ‘ఉషా గ్రూప్ ఆఫ్ మాగ్జైన్స్’ చీఫ్ ఎడిటర్ గా, మానేజింగ్ డైరెక్టర్ గా అచ్చు, అంతర్జాలం లో కుడా అందుబాటులో ఉండేటట్లు ఉషా వార, మాస పత్రికలు, పిల్లలకోసం ప్రత్యేకంగా ఉషా బాల పత్రికలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నిర్వహణ ఆర్ధికంగా భారం ఐనప్పటికీ ఎంతో అవసరం అన్నారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “మాతృభాషను పూర్తిగా పరిపాలనా భాషగా చేసి ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వేస్తున్న నామఫలకాలన్నీ తెలుగులో ఉండేట్లు చూడవలసినదిగా ఒకవైపు మనం ప్రభుత్వంపై వత్తిడి తెస్తూనే, మరో వైపు తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరం కృషి చేస్తున్న తెలుగు భాషాభిమానుల కృషిని ప్రోత్సహించడం ఈ సమావేశపు ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. వీరు చేస్తున్న కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు”.
విశిష్టఅతిథులుగా పాల్గొన్న – “అజగవ” – సాహితీ ఛానల్ నిర్వాహకులు రాజన్ పి.టి.స్.కె; “దాసుభాషితం” పాడ్కాస్ట్ ఛానల్ నిర్వాహకులు దాసు కిరణ్; “పద్య పరిమళం” యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు పాతూరి కొండల్ రెడ్డి; “వికీమీడియా ఫౌండేషన్” ద్వారా అంతర్జాలంలో ఉచిత సమాచారం అందించే సూరంపూడి పవన్ సంతోష్; “సారంగ” అంతర్జాల సాహిత్య పక్షపత్రిక నిర్వాహకురాలు కల్పన రెంటాల; “ఈమాట” అంతర్జాల సాహిత్యపత్రిక నిర్వాహకులు సురేష్ కొలిచాల;“శ్రీ కౌముది” వెబ్ మాసపత్రిక మరియు కి”రణ్ ప్రభ రేడియో టాక్ షో” హోస్ట్ కిరణ్ ప్రభ మరియు “నెచ్చెలి” అంతర్జాల వనితా మాసపత్రిక నిర్వాహకురాలు డా. కె. గీత వారి వారి వివిధ మాధ్యమాల ద్వారా తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం చేస్తున్న కృషి ని సోదాహరణంగా వివరించి అందరినీ ఆశ్చర్యపరచారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నాటి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చేస్తున్న కృషి ఎంతో అభినందిచదగ్గ విషయం అని కార్యక్రమ నిర్వహణలో తోడ్పడిన తానా కార్యవర్గ సభ్యులకు, ప్రసార మాధ్యమాలకు, అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- అమెరికా పర్యటనకు కేటీఆర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్









