సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్

- March 31, 2026 , by Maagulf
సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్

హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో అమాయక ప్రజలను నిలువునా ముంచుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో బ్యాంకింగ్ రంగం అత్యంత కీలకం అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణపై బ్యాంకర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టార్జితానికి కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు, కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా కస్టమర్ల భద్రత పట్ల మరింత బాధ్యతగా, మానవీయ కోణంలో వ్యవహరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగేటప్పుడు బ్యాంక్ సిబ్బంది అప్రమత్తత ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు.

ఇటీవల కాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ ముఠాలు సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు కాజేస్తున్నాయి. ఇటువంటి మోసాల బారిన పడిన బాధితులు తమ జీవితకాల సంపాదనను, ఫిక్స్‌డ్ డిపాజిట్లను హుటాహుటిన విత్‌డ్రా చేయడం లేదా అత్యవసరంగా బంగారంపై అప్పులు తీసుకోవడం వంటివి చేస్తుంటారని సీపీ వివరించారు. అటువంటి సమయాల్లో కస్టమర్ల ముఖాల్లో ఆందోళన, భయం లేదా అసాధారణ ప్రవర్తన కనిపిస్తే.. బ్యాంక్ సిబ్బంది వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఆ నగదు దేనికోసం తీస్తున్నారో ఆరా తీయడం ద్వారా అనేక మోసాలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చని ఆయన సూచించారు.

పెట్టుబడి మోసాలు మరియు ఇతర సైబర్ నేరాల బారిన పడేవారు తమ ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బును గుర్తుతెలియని ఖాతాలకు బదిలీ చేస్తున్నప్పుడు, బ్యాంకర్లు అనుమానిత లావాదేవీలను నిలిపివేయాలని సజ్జనార్ కోరారు. సైబర్ నేరగాళ్లు కస్టమర్లను ఫోన్ కాల్స్‌లో ఉంచి భయపెడుతున్నప్పుడు, బ్యాంకర్లు వారిని పక్కకు పిలిచి మాట్లాడటం ద్వారా వారిని ఆ ప్రమాదం నుండి రక్షించవచ్చని తెలిపారు. పోలీస్ శాఖ మరియు బ్యాంకింగ్ వ్యవస్థ సమన్వయంతో పనిచేస్తేనే సైబర్ నేరాలను సమర్థవంతంగా అడ్డుకోగలమని, ప్రతి బ్యాంక్ బ్రాంచ్ ఒక సైబర్ సెక్యూరిటీ కేంద్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com