సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- March 31, 2026
హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో అమాయక ప్రజలను నిలువునా ముంచుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో బ్యాంకింగ్ రంగం అత్యంత కీలకం అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణపై బ్యాంకర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టార్జితానికి కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు, కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా కస్టమర్ల భద్రత పట్ల మరింత బాధ్యతగా, మానవీయ కోణంలో వ్యవహరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగేటప్పుడు బ్యాంక్ సిబ్బంది అప్రమత్తత ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు.
ఇటీవల కాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ ముఠాలు సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు కాజేస్తున్నాయి. ఇటువంటి మోసాల బారిన పడిన బాధితులు తమ జీవితకాల సంపాదనను, ఫిక్స్డ్ డిపాజిట్లను హుటాహుటిన విత్డ్రా చేయడం లేదా అత్యవసరంగా బంగారంపై అప్పులు తీసుకోవడం వంటివి చేస్తుంటారని సీపీ వివరించారు. అటువంటి సమయాల్లో కస్టమర్ల ముఖాల్లో ఆందోళన, భయం లేదా అసాధారణ ప్రవర్తన కనిపిస్తే.. బ్యాంక్ సిబ్బంది వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఆ నగదు దేనికోసం తీస్తున్నారో ఆరా తీయడం ద్వారా అనేక మోసాలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చని ఆయన సూచించారు.
పెట్టుబడి మోసాలు మరియు ఇతర సైబర్ నేరాల బారిన పడేవారు తమ ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బును గుర్తుతెలియని ఖాతాలకు బదిలీ చేస్తున్నప్పుడు, బ్యాంకర్లు అనుమానిత లావాదేవీలను నిలిపివేయాలని సజ్జనార్ కోరారు. సైబర్ నేరగాళ్లు కస్టమర్లను ఫోన్ కాల్స్లో ఉంచి భయపెడుతున్నప్పుడు, బ్యాంకర్లు వారిని పక్కకు పిలిచి మాట్లాడటం ద్వారా వారిని ఆ ప్రమాదం నుండి రక్షించవచ్చని తెలిపారు. పోలీస్ శాఖ మరియు బ్యాంకింగ్ వ్యవస్థ సమన్వయంతో పనిచేస్తేనే సైబర్ నేరాలను సమర్థవంతంగా అడ్డుకోగలమని, ప్రతి బ్యాంక్ బ్రాంచ్ ఒక సైబర్ సెక్యూరిటీ కేంద్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు
- విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!
- జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!
- సౌదీలో 7రోజుల్లో 11,272 మంది నివాసితులు బహిష్కరణ..!!
- ఆన్లైన్ లో వ్యాఖ్యల పై యూఏఈ వార్నింగ్.. Dh500,000 ఫైన్..!!
- దోహా మెట్రోలో జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్..!!
- ఒమన్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ మెరుగు..!!
- ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO









