రియాద్‌లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- March 31, 2026 , by Maagulf
రియాద్‌లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సౌదీ అరేబియా రియాద్ టీం ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహణ

రియాద్, మార్చి 31: ఎన్‌ఆర్‌ఐ టీడీపీ, సౌదీ అరేబియా రియాద్ టీం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు, గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ ఎన్నారై అధ్యక్షుడు మరియు ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ వేమూరి రవి, బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ కె.బుచ్చిరాం ప్రసాద్ వీడియో కాల్ ద్వారా గల్ఫ్ దేశాల్లోని తెలుగుదేశం అభిమానులతో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

రియాద్ టీం సభ్యులు తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి), మహేంద్ర వాకాటి, శివ మోరంపూడి, శివ దబ్బకూటి, అనిల్ మర్రి, రామ్ మద్దుకూరి, నరేష్ చెన్నుపాటి, హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రవి మేడూరి, మోహన్, వెంకట్ దాసరి, ప్రవీణ్, సుధాకర్, రాజేష్, రాకేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని ప్రోత్సహించినందువల్లే తాము ఈ రోజు సౌదీ అరేబియాలో ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతున్నామని సభ్యులు గుర్తు చేసుకున్నారు.

మహిళా సభ్యుల ప్రత్యేక ఆకర్షణ

వేడుకల్లో మహిళా సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీదేవి వాకాటి, వనజ, విద్య, దీప్తి, శిరీష తదితర మహిళా కార్యకర్తలు మహిళా సాధికారత కోసం పార్టీ చేపట్టిన పథకాలను స్మరించుకున్నారు. వారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కార్మికులతో కలిసి వేడుకలు

రియాద్ సమీపంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సభ్యులు రాఘవేంద్ర చౌదరి, అన్నవరం, అంజి, షేక్ అజుముతుల్లా ఆధ్వర్యంలో గృహనిర్మాణ కార్మికుల సమక్షంలో కూడా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్మికులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని టీం సభ్యులు తెలిపారు.

చివరిగా, సౌదీ అరేబియాలోని టీడీపీ అభిమానులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, 2029లో కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని అందరూ ప్రతిజ్ఞ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com