హర్మూజ్‌ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన

- April 10, 2026 , by Maagulf
హర్మూజ్‌ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన

టెహ్రాన్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి చుట్టూ పరిణామాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని ప్రకటిస్తూ, ఇకపై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఖమేనీ, పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌ విజయం సాధించిందని పేర్కొన్నారు. ప్రజలు, సైన్యం చూపిన ధైర్యసాహసాల వల్లే ఈ విజయమని అన్నారు. అయితే, తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరలేదని స్పష్టం చేశారు.

అమెరికా- ఇరాన్‌ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చల్లో హర్మూజ్ జలసంధిపై మరింత నియంత్రణ కోరనున్నట్లు ఖమేనీ వెల్లడించారు. యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం కూడా డిమాండ్‌ చేస్తామని తెలిపారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి న్యాయం చేయాలని, బాధితులకు పరిహారం ఇవ్వాలని అమెరికా-ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్‌ యుద్ధాన్ని కోరుకోవడం లేదని ఖమేనీ స్పష్టం చేశారు. కానీ తమ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని హెచ్చరించారు. అవసరమైతే ప్రతీకారం తీసుకోవడంలో వెనుకాడబోమని అన్నారు. ఇదే సమయంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వీధుల్లోకి వచ్చి దేశానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఇక మరోవైపు, కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ దాడుల ఆరోపణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com