రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం

- April 23, 2026 , by Maagulf
రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం

అమరావతి: అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతం ఇప్పుడు అంతర్జాతీయ పారిశ్రామిక వేదికపై మెరవనుంది. ప్రముఖ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఇక్కడ భారీ క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక రంగం సరికొత్త పుంతలు తొక్కనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక ప్లాంట్‌కు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాకతో జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తోంది.

సుమారు 5,400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించబోతున్నారు. ఇందులో ప్రధానంగా 6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఇన్ గ్రేట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి అదనంగా మరో 125 మెగావాట్ల హైబ్రిడ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర ఇంధన అవసరాలు తీరడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుంది. రాబోయే రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ భారీ పరిశ్రమ స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. సుమారు 2,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. కేవలం రాంబిల్లిలోనే కాకుండా త్వరలో అనంతపురం జిల్లాలో కూడా రూ.22,000 కోట్లతో భారీ హైబ్రిడ్ ప్రాజెక్టును రెన్యూ సంస్థ చేపట్టనుంది. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజాల రాకతో ఏపీ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మారుతోంది. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ ప్రధాన ఆశయంగా కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com