పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు

- April 26, 2026 , by Maagulf
పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని ఏ ఒక్క పెట్రోల్ బంకు వద్ద కూడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని ఆయిల్ కంపెనీలకు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ మేరకు కఠిన ఆదేశాలు ఇచ్చారు.

ప్రజల ప్రాథమిక అవసరాలైన ఇంధన సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేస్తే, సదరు కంపెనీల అనుమతులపై పునరాలోచన చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. రిటైల్ ఔట్‌లెట్లకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేసి, సరఫరాను ఆపడం బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలతో కాలయాపన చేయడం మానేసి, క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు.

రాష్ట్రంలో నయారా, రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు సరఫరాను నిలిపివేయడం వల్లే సమస్య జటిలమైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి తోడు ప్రస్తుతం వరి కోతలు, ఆక్వా రంగంలో డీజిల్‌కు డిమాండ్ పెరగడం కూడా కొరతకు కారణమైంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే టాస్క్‌ఫోర్స్ మరియు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసిందని సీఎం వెల్లడించారు. రైతులకు డీజిల్ కొరత లేకుండా చూసేందుకు అవసరమైతే కూపన్ విధానాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇంధనం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన నిఘా ఉంచాలని, సరఫరాను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com