UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- August 13, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా భేటీ అయ్యారు.ఇరు దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న సోదర సంబంధాలను మరింత బలోపేతం చేయడం, వివిధ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం పై ఇరువురు నేతలు చర్చించారు.
యూఏఈలో సోదర దేశ పర్యటనకు వచ్చిన బహ్రెయిన్ రాజుకు అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్యంగా ఆర్థిక, అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఇరు దేశాల ఉమ్మడి ప్రాధాన్యతలు, ప్రయోజనాలను సాధించే మార్గాలపై చర్చించారు.
ప్రాంతీయ పరిణామాల పై చర్చ
సమావేశంలో మిడిల్ ఈస్ట్ లో తాజా పరిణామాలతో పాటు ఇరు దేశాలకు ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాంతంలోని అన్ని దేశాలు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై చర్చించారు.
ప్రాంతం ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్ల నేపథ్యంలో యూఏఈ–బహ్రెయిన్ మధ్య సన్నిహిత సమన్వయం, సహకారం మరింత అవసరమని ఇరువురు నేతలు స్పష్టం చేశారు.
యూఏఈ–బహ్రెయిన్ మధ్య లోతైన, చారిత్రక సంబంధాల పై ఇరువురు నేతలు గర్వం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు.
యూఏఈ మద్దతుకు బహ్రెయిన్ రాజు ప్రశంసలు
వివిధ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బహ్రెయిన్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో యూఏఈ అందిస్తున్న నిరంతర మద్దతును రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రశంసించారు.
ఈ సమావేశంలో యూఏఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ జాయెద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ అధ్యక్షుడి సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్, సహాయ మంత్రి షేక్ షఖ్బూత్ బిన్ నహ్యాన్ అల్ నహ్యాన్ తదితరులు పాల్గొన్నారు.
బహ్రెయిన్ తరఫున జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ గార్డ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా, ఇతర రాజ కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
అంతకుముందు బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా యూఏఈకి చేరుకోగా, విమానాశ్రయంలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







