దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- August 12, 2026
దుబాయి: దుబాయిలో భారత కాన్సులేట్కు నూతన కన్సుల్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణకు చెందిన డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డిని Gulf Workers Awareness Center (GWAC) కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్భంగా GWAC ప్రతినిధులు కన్సుల్ జనరల్కు వినతిపత్రం అందజేసి, దుబాయి, నార్తర్న్ ఎమిరేట్స్లో తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వస్తున్న బ్లూ కాలర్ కార్మికులకు ముందస్తు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రత్యేక చర్చ
గల్ఫ్కు వచ్చే తెలంగాణ కార్మికుల్లో గుల్ఫారం/గుట్కా వంటి పొగాకు పదార్థాల అలవాట్లకు సంబంధించిన సమస్యలు, వాటి వల్ల ఎదురవుతున్న ఆరోగ్య ఇబ్బందులను GWAC ప్రతినిధులు కన్సుల్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సవివరంగా తెలుసుకున్న డా. ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి, ఈ అంశాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
అలాగే దుబాయిలోని కొన్ని డీ-అడిక్షన్ కేంద్రాలతో కూడా చర్చలు జరుపుతున్నామని, అవసరమైన వారికి ఇక్కడ వైద్య సహాయం అందించే అవకాశాలపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ఆసుపత్రి
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మించే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఆసుపత్రి కోసం భూ కేటాయింపు ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, అనంతరం నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కన్సుల్ జనరల్ తెలిపారు.
తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి, సమస్యలను ప్రాధాన్యత క్రమంలో చర్చించి, పరిష్కారానికి ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుదామని డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి సూచించారు.
తెలంగాణ అధికారుల నియామకంపై GWAC హర్షం
ఎంబసీ, కాన్సులేట్లలో తెలుగు అధికారులు ఉండేలా గతంలో GWAC తరఫున చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా ప్రతినిధులు గుర్తుచేశారు. తమ ఆకాంక్ష నెరవేరి, తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి దుబాయి భారత కాన్సుల్ జనరల్గా నియమితులవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.
డా. ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి పదవీకాలంలో తెలంగాణ గల్ఫ్ కార్మికులకు సేవలందించేందుకు, వారి సమస్యల పరిష్కారానికి GWAC ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ దోనికేని తెలిపారు.
ఈ సమావేశంలో కృష్ణ దోనికేని, శ్రీనివాస్ రెండ్ల, నరేందర్ గడ్చంద, అనిల్ కుమార్ కటుకం, మోతే రాములు, సతీష్ దారం, నరేష్ కల్లెడ, బాబు బోస, సముద్రాల శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, శంకర్ లౌడ్య, సుమన్ చింతన్ పల్లి, శ్రీనివాస్ ఎలకపల్లి పాల్గొన్నారు.



తాజా వార్తలు
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక
- కువైట్లో ఉగ్ర కుట్ర భగ్నం.. కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న పౌరుడి అరెస్ట్
- అబుదాబి షాపింగ్ సెంటర్లో లులు గ్రూప్ ఉద్యోగులతో UAE అధ్యక్షుడి భేటీ
- సౌదీ అరేబియాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన విపుల్
- డా.ఈష్ సింఘాల్కు ఘన వీడ్కోలు.. కతార్లో భారతీయ సమాజానికి విశేష సేవలకు ప్రశంసలు







