ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- April 27, 2026
ముంబై: ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాత్రి వరకు బంధువులతో కలిసి సంతోషంగా గడిపిన వారు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ముంబైలోని పైధోనీ ప్రాంతంలో నివసించే అబ్దుల్లా డొకాడియా (40), ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనాబ్ (13) తమ బంధువులను రాత్రి విందుకు ఆహ్వానించారు. అందరూ కలిసి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్నారు. బంధువులు వెళ్లిపోయిన తర్వాత, అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి పుచ్చకాయ ముక్కలను తిన్నారు. అయితే, తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఒక్కొక్కరికి తీవ్రమైన వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే జేజే ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ నలుగురూ కన్నుమూశారు.
ఈ మరణాలకు అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారు తిన్న బిర్యానీ వికటించిందా (Food Poisoning) లేక బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ తినడం వల్ల ఏవైనా రసాయనిక చర్యలు జరిగాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది. సాధారణంగా బిర్యానీ వంటి భారీ ఆహారం తిన్న వెంటనే పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుందని కొందరు భావిస్తుంటారు. అయితే, బంధువులందరూ బిర్యానీ తిన్నా కేవలం పుచ్చకాయ తిన్న ఈ నలుగురే మరణించడంతో, పుచ్చకాయలో ఏవైనా పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయా లేదా అది పాడైపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘోర కలికలంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం పంపించడంతో పాటు, వారు తిన్న ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. అబ్దుల్లా కుటుంబం ఏ దుకాణం నుంచి బిర్యానీ తెప్పించారు, పుచ్చకాయ ఎక్కడ కొన్నారు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగా లేక మరేదైనా కుట్ర కోణం ఉందా అనేది స్పష్టమవుతుందని అధికారులు వెల్లడించారు. ఒకే కుటుంబం ఇలా అంతమైపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







