జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

- May 01, 2026 , by Maagulf
జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్: "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" తో రాష్ట్రాల ప్రజల్లో పరస్పర అవగాహన కలగడంతో పాటు జాతీయ సమైక్యత బలోపేతం అవుతుందనీ రాష్ట్ర గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా అన్నారు.

 శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ లో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు 

ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
వైవిధ్యాలున్న ఐక్యతే భారతదేశ బలమని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా  అన్నారు.
పశ్చిమ భారత అభివృద్ధిలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. సాంస్కృతిక వారసత్వంతో పాటు ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ఈ రాష్ట్రాలు విశిష్ట స్థానాన్ని సంపాదించాయని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం మహారాష్ట్రకు గౌరవాన్ని తీసుకువచ్చిందని,  భక్తి సంప్రదాయం సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిందని చెప్పారు.

మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి మహనీయుల పుట్టినిల్లు గుజరాత్ రాష్ట్రం దేశానికి సేవా భావం, ఆవిష్కరణల దిశగా మార్గదర్శకంగా నిలిచిందని గవర్నర్ కొనియాడారు.
అది శంకరాచార్యులు దేశ సాంస్కృతిక, భౌగోళిక ఐక్యత కోసం కృషి చేశారని అన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" పేరుతో దేశంలోని విభిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర అవగాహన, సాంస్కృతిక బంధాన్ని పెంపొందిస్తూ, "భిన్నత్వంలో ఏకత్వం" అనే భావనను బలోపేతం చేస్తూ జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తున్నారన్నారు.

 ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు తమ మూలాలను నిలబెట్టుకుంటూనే తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com