విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్

- May 04, 2026 , by Maagulf
విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అందిస్తున్న రాగిజావ పంపిణీని మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో విద్యాశాఖ, శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలందరికీ ఈ పోషకాహారం అందుతుంది.

పాఠశాలల్లో పిల్లలకు వడ్డించే భోజనం నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదు. సన్న బియ్యంతో పాటు మెనూలో చేసిన మార్పుల వల్ల భోజనం చేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యాశాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ భోజనం రుచి, శుచిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. వారానికి ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కీతో పాటు ఇప్పుడు రాగిజావ కూడా తోడవడంతో పిల్లల్లో రక్తహీనత తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఈ గొప్ప కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తోంది. రాగిజావ తయారీకి అవసరమైన రాగి పిండి, బెల్లం పొడిని ఈ సంస్థ ఉచితంగానే సరఫరా చేస్తుంది. సుమారు 80 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా కేంద్రాల వరకు వీటిని చేరవేస్తారు. అక్కడి నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా నేరుగా స్కూళ్లకు చేరుతాయి. కాల్షియం, ఐరన్ నిండిన ఈ ఆహారం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా డ్రాప్ అవుట్స్ కూడా తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com