డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

- May 07, 2026 , by Maagulf
డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ విభాగం ‘ఈగిల్ ఫోర్స్’ పనితీరును డీజీపీ తొలిసారిగా సమీక్షించారు. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల సమస్యను అరికట్టేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

డ్రగ్స్ కారణంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు మరియు యువత భవిష్యత్తు నాశనం అవుతోందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను కేవలం పోలీస్ శాఖ ఒక్కటే ఎదుర్కోలేదని, సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, డీ-అడిక్షన్ కేంద్రాలు, స్థానిక సమాజాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని వేగంగా పంచుకోవడం, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత అవసరమని తెలిపారు.

అలాగే మాదకద్రవ్యాలకు బానిసైన యువతకు పునరావాసం కల్పించేందుకు డీ-అడిక్షన్ కేంద్రాల సహకారం కీలకమని డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ ముప్పును సమర్థవంతంగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com