ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ

- May 11, 2026 , by Maagulf
ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ అంశాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని చంద్రబాబు వివరించారు. రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంతం వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అమిత్ షాకు వివరించారు.

పోలవరం నిధుల విడుదల పై విన్నపం

రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడమే తమ ప్రాధాన్యతని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి వివరిస్తూ, నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. జల్ శక్తి శాఖ మంత్రితో కూడా ఆయన విడిగా భేటీ కానున్నారు.

విభజన హామీలు–పెండింగ్ అంశాలు
రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై చంద్రబాబు అమిత్ షాకు ఒక సమగ్ర నివేదికను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక మద్దతు కావాలని కోరారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర సహకార శాఖ నుంచి ఏపీకి మరిన్ని రాయితీలు, మద్దతు కల్పించాలని ప్రతిపాదించారు. అమిత్ షాతో భేటీ అనంతరం చంద్రబాబు మరికొందరు కేంద్ర మంత్రులను, అలాగే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులను కలవనున్నారు. సాయంత్రం CII బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొని పారిశ్రామికవేత్తలతో రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ ఢిల్లీ పర్యటన, ఏపీ అభివృద్ధికి ఊతమిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com