ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- May 20, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ఒంటరిగా సైనిక చర్యలు చేపట్టే అధికారాలకు బ్రేక్ పడింది. ఇరాన్ పై అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే కీలక తీర్మానాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. గతంలో ఏడుసార్లు విఫలమైన ఈ ప్రయత్నం, ఎనిమిదోసారి ఎట్టకేలకు విజయం సాధించింది. సెనేట్లో జరిగిన ఓటింగ్లో ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. విశేషం ఏమిటంటే, డెమొక్రాట్లకు మద్దతుగా నలుగురు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.
డెమొక్రాటిక్ (Democratic) సెనేటర్ టిమ్ కెయిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం… అమెరికా కాంగ్రెస్ అధికారికంగా యుద్ధ ప్రకటన చేయకుండా లేదా ప్రత్యేక అనుమతి ఇవ్వకుండా అమెరికా సైన్యాన్ని ఇరాన్ పై ఎటువంటి యుద్ధ చర్యల్లోనూ కొనసాగించకూడదు. త్వరలోనే దీనిపై తుది ఓటింగ్ జరగనుంది. ఇది పూర్తిగా చట్టంగా మారితే, కాంగ్రెస్ అధికారిక అనుమతి ఇచ్చేవరకు ట్రంప్ ఇరాన్ పై ఎలాంటి దాడులకు దిగడానికి వీలుండదు. ఈ పరిణామంపై కాలిఫోర్నియా డెమొక్రాట్ సెనేటర్ ఆడమ్ షిఫ్ స్పందిస్తూ… “అసంవిధానిక యుద్ధానికి ముగింపు పలకాలంటూ మేము చేసిన ప్రయత్నానికి రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం సంతోషకరం” అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.
ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుంది: ట్రంప్ ధీమా
మరోవైపు, ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు త్వరలోనే ముగుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఉందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా విపరీతంగా పెరగడం వల్ల అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు కుప్పకూలే స్థాయికి పడిపోతాయని ట్రంప్ అంచనా వేశారు. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన మార్కెట్లలో నెలకొన్న అస్థిరత పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకే ఇరాన్పై చేపట్టాలనుకున్న ప్రణాళికాబద్ధ సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం ఇరాన్తో కీలక చర్చలు జరుగుతున్నాయని, శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని గల్ఫ్ దేశాల నాయకులు సూచించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









