కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- June 02, 2026
కువైట్ సిటీ: కువైట్ సెంట్రల్ జైలు నుంచి ఇటీవల పరారైన ముగ్గురు ఖైదీలను భద్రతా బలగాలు విజయవంతంగా అరెస్ట్ చేశాయి. దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారిని పోలీసులు హైస్పీడ్ చేజ్ అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, పరారైన ఖైదీలు హసన్ సాలెం అల్ రషీది (కువైటీ), అహ్మద్ మహ్మద్ ఖతా (విదేశీయుడు), అలీ మనాహి అల్ సుబాయీ (కువైటీ)లను గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం వారిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.
ఖైదీలు పరారైన వెంటనే వారి వివరాలను దేశంలోని అన్ని సరిహద్దు ప్రవేశ, నిష్క్రమణ కేంద్రాలకు పంపించి అప్రమత్తం చేశారు. అనంతరం పోలీసులు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు, కచ్చితమైన దర్యాప్తు చేపట్టడంతో వారి ఆచూకీ లభించింది.
మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వీడియోలో, ముగ్గురు నిందితులు ఎరుపు రంగు పికప్ ట్రక్కులో ప్రయాణిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెండు పట్రోల్ వాహనాలతో వారిని వెంబడించి హైస్పీడ్ చేజ్ అనంతరం పట్టుకున్నారు.
అరెస్ట్ సమయంలో వారి వద్ద పాస్పోర్టులు ఉండటంతో పాటు రెండు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశం విడిచి పారిపోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఖైదీల పరారిపై కువైట్ తొలి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహాద్ యూసుఫ్ సౌద్ అల్ సబాహ్ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన సూచనలతోనే భద్రతా సంస్థలు వేగంగా చర్యలు తీసుకుని నిందితులను పట్టుకున్నాయి.
ఈ సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. పరారైన ఖైదీలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే అత్యవసర నంబర్ 112కు తెలియజేయాలని సూచించింది.
సమాజ భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని, చట్టాన్ని ఉల్లంఘించే లేదా నేరస్థులకు సహకరించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రజా భద్రతకు భంగం కలిగించే వారిని వదిలిపెట్టబోమని, న్యాయ వ్యవస్థ నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









