స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- June 08, 2026
హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడానికి డీజీపీ సి.వి.ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.గతంలో అమలులో ఉండి కొంతకాలంగా నిలిచిపోయిన ‘స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్’ విధానాన్ని ఆయన పునరుద్ధరించారు.
ప్రతి రెండు వారాలకు ఒకసారి నిర్వహించే ఈ సమావేశంలో డీజీపీ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు, వివిధ విభాగాధిపతులు (హెచ్వోడీలు) పాల్గొని విధానాలు, కార్యక్రమాలు, పరస్పర సమన్వయం అవసరమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల లేమి కారణంగా శాఖలోని పలు విభాగాల మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
తొలి సమావేశంలో కీలక అంశాల పై చర్చ
పునరుద్ధరించిన ఈ సమావేశం తొలి విడతలో పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. విదేశీ గృహ కార్మికుల (ఫారిన్ డొమెస్టిక్ వర్కర్స్) వివరాలను సమగ్ర డేటాబేస్ రూపంలో నిర్వహించడం ద్వారా మెరుగైన పర్యవేక్షణ, భద్రతా చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలించారు.
అలాగే సీసీటీఎన్ఎస్ 2.0 (Crime and Criminal Tracking Network & Systems) అమలు, సాంకేతిక ఆధారిత పోలీసింగ్, కృత్రిమ మేధస్సు (AI), డ్రోన్లు, డేటా ఇంటెలిజెన్స్ వ్యవస్థల వినియోగాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణపై చర్చ జరిగింది.
ట్రాఫిక్ భద్రతకు కొత్త వ్యవస్థ
రాబోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇతర విభాగాల పరిపాలనా నిర్మాణంపై కూడా సమావేశంలో చర్చించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమైన చర్యలను పరిశీలించారు.
మహిళా పోలీసుల సంక్షేమం పై దృష్టి
మహిళా పోలీసు సిబ్బంది పనివాతావరణం, లింగ సమానత్వం మెరుగుపరిచే లక్ష్యంతో నిర్వహించిన ఉమెన్స్ సమ్మిట్లో వచ్చిన సిఫార్సులను అమలు చేయాలని డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. మహిళా సిబ్బందికి మరింత అనుకూలమైన విధానాలను రూపొందించాలని సూచించారు.
ఇతర పరిపాలనా అంశాలు
ఈ సమావేశంలో పోలీసు సంఘాల ఎన్నికలు, సిబ్బంది మరియు వాహనాల ఆడిట్, సంక్షేమ నిధుల ఆడిట్, రాష్ట్రంలోని నాలుగు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కూడా చర్చించి తగిన సూచనలు చేశారు.
శాఖలో సమర్థవంతమైన పరిపాలన, ఆధునిక సాంకేతిక వినియోగం, విభాగాల మధ్య సమన్వయం పెంపు లక్ష్యంగా ఈ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







