ఒమన్ తీరంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి..!!

- June 11, 2026 , by Maagulf
ఒమన్ తీరంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి..!!

యూఏఈ: ఒమన్ తీరంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు నిర్ధారించారు. పలావు జెండా కలిగిన MT సెట్టెబెల్లో నౌకలోని 24 మందిలో, మొదట ముగ్గురు భారతీయ నావికులు గల్లంతైనట్లు తెలిపారు. ఇప్పుడు వారు మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.  ఒమన్ తీరంలో అమెరికా మిస్సైట్ దాడిగా అనుమానిస్తున్న ఘటనలో ఈ ట్యాంకర్ దెబ్బతిన్నది.

కాగా,  రెండు మృతదేహాలను వెలికితీశామని, వాటిని వెంటనే స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని భారత ఓడరేవులు, నౌకాయానం మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. "పలావు జెండా కలిగిన MT సెట్టెబెల్లో నౌకలో జరిగిన ఈ విషాద సంఘటన గురించి తెలుసుకోవడం చాలా దురదృష్టకరం. మొదట గల్లంతైనట్లుగా నివేదించబడిన ముగ్గురు భారతీయ నావికుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో ఇప్పుడు మరణించినట్లు నిర్ధారించారు." అని సోనోవాల్ Xలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

 ఇది మన సముద్రయాన కుటుంబానికి తీరని లోటని, ఈ క్లిష్ట సమయంలో మోదీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుందన్నారు. మృతుల పార్థివ దేహాలను స్వదేశానికి వేగంగా తీసువచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. 

తమ ఆదేశాలను పాటించకుండా ఇరాన్ నుంచి చమురును తీసుకువస్తున్న నౌకపై తమ సైన్యం దాడి చేసిందని అమెరికా పేర్కొంది. అయితే, వాణిజ్య నౌకపై జరిగిన దాడిని నిరసిస్తూ, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (అమెరికాస్) నాగరాజ్ నాయుడు.. అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జేసన్ మీక్స్‌ ను పిలిపించి నిరసన తెలియజేశారు.

24 మంది భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో 21 మంది భారతీయులను రక్షించగా, ముగ్గురు గల్లంతైనట్లు మొదట వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడుల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఇవి ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు ప్రత్యక్ష ఫలితమని భారత్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com