మినీబస్–ట్రక్ ప్రమాద బాధితులను పరామర్శించిన దుబాయ్ పోలీసులు
- June 11, 2026
దుబాయ్: ఎమిరేట్స్ రోడ్డుపై గత ఆదివారం జరిగిన ఘోర మినీబస్–ట్రక్ ప్రమాదంలో గాయపడిన బాధితులను దుబాయ్ పోలీసులు పరామర్శించారు. దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రీ ఆదేశాల మేరకు, ఆపరేషన్స్ వ్యవహారాల అసిస్టెంట్ కమాండెంట్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూయి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ రషీద్ ఆసుపత్రిని సందర్శించి, చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
బ్రిగేడియర్ జుమా బిన్ సువైదాన్తో పాటు అల్ ఖవానీజ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఆదెల్ మూసా హసన్ అల్ బ్లూషి, ట్రాఫిక్ ప్రమాదాల విభాగం డైరెక్టర్ కల్నల్ ఇంజినీర్ అబ్దుల్లా థానీ బిన్ ఘాలిబ్ మరియు పలువురు పోలీసు అధికారులు ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రిగేడియర్ జుమా మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాలతో మానవీయ సంబంధాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దుబాయ్ పోలీసులు చేపడుతున్న సామాజిక కార్యక్రమాల్లో భాగంగానే ఈ పరామర్శ నిర్వహించినట్లు తెలిపారు.
అలాగే, వాహనదారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించాలని, ప్రమాదాలు లేదా వాహనాలు నిలిచిపోయిన సందర్భాల్లో నిర్దేశిత భద్రతా నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఈ జాగ్రత్తలు ప్రమాదాలను నివారించడంలో, వాటి తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, బాధితులు తమను పరామర్శించిన దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మానవీయ చర్య తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని, ప్రమాదం అనంతరం ఎదురైన మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడిందని చెప్పారు. అన్ని పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలుస్తున్న దుబాయ్ పోలీసుల సేవలను వారు ప్రశంసించారు.
కాగా, గత ఆదివారం ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఒక ట్రక్ ముందుగా జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా రోడ్డుమధ్యలో నిలిచిపోయింది. అదే దిశలో వస్తున్న మినీబస్ ఆ ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి తీవ్రంగా ఉండగా, నలుగురికి మోస్తరు గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







