సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

- June 15, 2026 , by Maagulf
సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి

సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా నేడు సింగపూర్‌లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌కు చెందిన ప్రముఖ కంపెనీలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు హై కమిషనర్‌ను కోరారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను వివరించారు.

ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ రైతులు పండిస్తున్నారని, ముఖ్యంగా హార్టికల్చర్ పంటల ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో రాష్ట్రం ముందంజలో ఉందని సీఎం తెలిపారు. ఆహార ఉత్పత్తుల నాణ్యత, భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ట్రేసబులిటీ వ్యవస్థను అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

అదేవిధంగా రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో సింగపూర్ సంస్థల సహకారం కోరుతున్నామని సీఎం వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

ఈ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్–సింగపూర్ మధ్య వాణిజ్య, పారిశ్రామిక మరియు సాంకేతిక సహకారం మరింత బలోపేతం కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com