పుట్టగానే జనన ధ్రువీకరణ పత్రం జారీ సేవలు..

- August 10, 2016 , by Maagulf
పుట్టగానే జనన ధ్రువీకరణ పత్రం జారీ సేవలు..

పుట్టగానే జనన ధ్రువీకరణ పత్రం జారీ సేవలు విస్తృతం చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ప్రారంభించిన సేవలు మరో 25 ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. శిశువు పుట్టిన గంటల్లోనే ఆధార్‌ కార్డు జారీ.. జనన సమయంలో లోపాల గుర్తింపు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ శిశు ఆధార్‌ ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చింది. పైలట్‌ ప్రాజెక్టుగా గ్రేటర్‌లో అమలు ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రసూతి ఆస్పత్రుల బాధ్యులతో బుధవారం అదనపు కమిషనర్‌ (ఐటీ) సురేంద్రమోహన్‌ సమావేశమయ్యారు. ప్రాజెక్టు ముఖ్యోద్దేశం, ప్రయోజనాలను వివరించారు. పుట్టిన గంటల వ్యవధిలో ఐరిస్‌ నమోదయ్యే అవకాశం ఉండదు కనుక ఆధార్‌ గుర్తింపు నెంబర్‌ కేటాయిస్తారు. కొన్ని నెలల తరువాత ఐరిస్‌ ద్వారా కార్డు జారీ చేస్తారు. దీనికి అవసరమైన కంప్యూటర్‌, ఇతర వసతులు ఆస్పత్రుల యాజమాన్యాలే సమకూర్చుకోవాలని సురేంద్రమోహన్‌ సూచించారు. శిశువులకు సంబంధించిన ఆధార్‌, ఇతర వివరాలు ఆన్‌లైన్‌ డిజిటల్‌ లాకర్‌లో భద్రపరుస్తారు. ఈ నెలాఖరుకు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు చేతుల మీదుగా ఎంపిక చేసిన 25 ఆస్పత్రుల్లో ఆధార్‌, లోపాల గుర్తింపు సేవలు ప్రారంభిస్తామని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుడితే వారంలో పత్రం ఆధార్‌ నమోదు ద్వారా జనన ధ్రువీకరణ పత్రం త్వరగా పొందే వెసులుబాటు ఉంటుంది. ఆధార్‌ నమోదు చేసుకున్న శిశువులకు వారంలో బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య, యూఐడీఐఏ ఆర్‌ఓ, ఐటీఈ అండ్‌ సీ తదితర విభాగాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. పుట్టుకతో ఉండే లోపాలు జనన ఽధ్రువీకరణ పత్రంలో పొందుపరుస్తారు. ఆధార్‌, లోపాలకు సంబంధించిన వివరాలు డిజిటల్‌ లాకర్‌ నుంచి ఎప్పుడైనా తీసుకునే అవకాశం సంబంధిత పౌరులకు ఉంటుంది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందడం సులువవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com