రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..

- July 03, 2026 , by Maagulf
రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) హోదా నుంచి పై స్థాయి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో మే 30, 2026న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జారీ చేసిన ఆదేశాల అమలు పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు.

రాష్ట్రంలో విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, చట్ట అమలు ప్రాధాన్యతలు, పోలీసింగ్‌లో తీసుకున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయనే అంశాలపై అధికారులు సమగ్రంగా చర్చించారు. గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు చేపట్టాలని డీజీపీ స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో లా అండ్ ఆర్డర్, సీఐడీ, టెక్నికల్ సర్వీసెస్, ఆర్గనైజేషన్, హోంగార్డ్స్ అండ్ ఆపరేషన్స్ విభాగాల డైరెక్టర్ జనరల్స్, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్, శిక్షణ విభాగం ఇన్‌ఛార్జ్ చైర్మన్, టీజీపీఏ, ఈగిల్, సీఎస్‌బీ, ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్లు, అదనపు డీజీపీలు, ఇన్‌స్పెక్టర్ జనరల్స్, అన్ని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, డీఐజీలు, ఎస్‌పీ లీగల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయాలు, ఎస్‌డీపీవోలు, సర్కిల్ కార్యాలయాల నుంచి ఎస్‌ఐ స్థాయి పైబడి అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

సమీక్ష సమావేశాలకు అత్యవసర పరిస్థితులు మినహా ఎలాంటి మినహాయింపులు ఉండవని డీజీపీ స్పష్టం చేశారు.ప్రతి అధికారి తప్పనిసరిగా పాల్గొని, సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.

పోలీసింగ్‌లో సమర్థవంతమైన పనితీరు కోసం ఆదేశాలు జారీ చేయడం మాత్రమే కాకుండా, వాటి అమలును నిరంతరం పర్యవేక్షించడం, ఫలితాలను సమీక్షించడం కూడా అంతే ముఖ్యమని డీజీపీ పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు క్రమబద్ధమైన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com