ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!

- July 15, 2026 , by Maagulf
ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!

దోహా: అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) గల్ఫ్ ప్రాంతానికి సంబంధించిన విమానయాన వార్నింగ్ ను మరింత కఠినతరం చేసింది. ఖతార్, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమాన్ గల్ఫ్ గగనతలంలో విమానాలు నడపకుండా ఎయిర్‌లైన్స్‌కు సూచించింది. ఈ హెచ్చరికలు జూలై 29 వరకుఅమల్లో ఉంటుందని EASA తెలిపింది. వారం రోజుల క్రితం గల్ఫ్ దేశాలు, జోర్డాన్ గగనతలంలో విమానాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మాత్రమే సూచించగా, తాజా బులెటిన్‌లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయని పేర్కొంది.

మిస్సైల్, డ్రోన్ దాడుల ముప్పు

మిడిలీస్టు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉండటంతో క్షిపణులు, డ్రోన్ దాడుల ప్రమాదం పెరిగిందని EASA హెచ్చరించింది. అంతేకాకుండా, వైమానిక రక్షణ వ్యవస్థలు పౌర విమానాలను పొరపాటున సైనిక లక్ష్యాలుగా గుర్తించే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం ఇరాన్ ఖతార్‌ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ఈ తాజా హెచ్చరిక వెలువడింది.   

ఇతర గల్ఫ్ దేశాలపైనా ముప్పు

ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా ప్రాంతాలపై కూడా దాడుల ముప్పు నెలకొంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న గల్ఫ్ ట్యాంకర్లపై కూడా దాడులు జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, అమెరికా దాడుల అనంతరం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినట్లు ప్రకటనలు, అలాగే కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయని EASA పేర్కొంది.

ఇరాన్, ఇరాక్, లెబనాన్‌పైనా ఆంక్షలు

ఇక ఇరాన్, ఇరాక్, లెబనాన్ గగనతలంలో విమానాలు నడపవద్దని గత వారం జారీ చేసిన హెచ్చరికను కూడా EASA ఆగస్టు చివరి వరకు పొడిగించింది. ప్రాంతీయ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే మరిన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని EASA స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com