కువైట్‌లో ఆన్‌లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!

- July 15, 2026 , by Maagulf
కువైట్‌లో ఆన్‌లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!

కువైట్: ఈ-కామర్స్, ఆన్‌లైన్ డెలివరీ రంగాన్ని నియంత్రించేందుకు కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ ఆర్డర్లపై డెలివరీ ఛార్జీ గరిష్ఠంగా KD1 మాత్రమే వసూలు చేయాలని నిర్దేశించింది. అలాగే వ్యాపార సంస్థల నుంచి డెలివరీ యాప్‌లు వసూలు చేసే కమిషన్‌ను 10 శాతం నుంచి గరిష్ఠంగా 17 శాతానికి పరిమితం చేశారు.

వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్‌లో ప్రచురించిన ప్రకారం.. ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు, వ్యాపార సంస్థలు, వినియోగదారుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ప్రస్తుతం కొన్ని డెలివరీ యాప్‌లు వ్యాపారుల నుంచి 35 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు ఆర్థిక భారం తగ్గి, లాభదాయకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వినియోగదారులకు కొత్త రక్షణలు

వినియోగదారుల ప్రయోజనాల కోసం కూడా పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.  ప్రతి ఆర్డర్‌పై డెలివరీ ఛార్జీ KD1కు మించకూడదు. ఆపరేషనల్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల పేరుతో అదనపు రుసుములు వసూలు చేయరాదు. ఆర్డర్ ట్రాకింగ్ సదుపాయం తప్పనిసరిగా అందించాలి.  ఆలస్యం జరిగితే వినియోగదారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఫిర్యాదులకు 48 గంటల్లో ప్రాథమిక స్పందన, 7 రోజుల్లో పరిష్కారం అందించాలి. ప్లాట్‌ఫారమ్ లేదా వ్యాపారి తప్పిదం వల్ల ఆర్డర్ రద్దు అయితే వినియోగదారుడిపై ఎలాంటి ఖర్చు మోపకూడదు.

వ్యక్తిగత సమాచారం భద్రతకు ప్రాధాన్యం

కొత్త నిబంధనల ప్రకారం డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులు, వ్యాపారుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. కోర్టు ఆదేశాలు లేదా భద్రతా సంస్థల అభ్యర్థన మినహా ఆ సమాచారాన్ని ఇతరులకు వెల్లడించరాదు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సైబర్ భద్రతా చర్యలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది.

కాగా, జూలై 9, 2026కు ముందు కుదిరిన ఒప్పందాలను కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్చుకునేందుకు సంస్థలకు దాదాపు రెండు నెలల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 1, 2026 తర్వాత నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై హెచ్చరికలు, తాత్కాలికంగా ప్లాట్‌ఫారమ్ మూసివేత, తీవ్రమైన సందర్భాల్లో వాణిజ్య లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అధికారం వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఉంటుంది. పోటీ చట్టాల ఉల్లంఘనలపై న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com