విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’

- July 16, 2026 , by Maagulf
విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
  • ఆగస్టు 8న విజయవాడ హయత్ ప్లేస్‌లో ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం
  • వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఘన సత్కారం – గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ

విజయవాడ, జూలై 15: సమాజంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ప్రతిభావంతులను గుర్తించి ఘనంగా సత్కరించేందుకు గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో "స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026" కార్యక్రమాన్ని తొలిసారిగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి జయా పటేరియా వెల్లడించారు.

బుధవారం విజయవాడలోని భారతి నగర్‌లోని గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆగస్టు 8 (శనివారం) సాయంత్రం 6 గంటలకు విజయవాడ హయత్ ప్లేస్ హోటల్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యాపారం, కళలు, సాహిత్యం, సాంస్కృతికం, మీడియా, సామాజిక సేవ, క్రీడలు, యువజన సేవ, మహిళా సాధికారత తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి, సమాజాభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులను ఎంపిక చేసి **"స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026"**తో ఘనంగా సత్కరించనున్నట్లు వెల్లడించారు.

ఈ అవార్డుల ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం, సేవాభావంతో పనిచేస్తున్న వ్యక్తులకు తగిన గుర్తింపు కల్పించడం, యువతకు స్ఫూర్తినిచ్చే విజయగాథలను సమాజానికి చేరవేయడం అని నిర్వాహకులు తెలిపారు.

అమరావతి రాజధాని అభివృద్ధి, రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచస్థాయికి చేర్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రేరణగా, అమరావతి ప్రాంతానికి మరింత ఖ్యాతి తీసుకురావాలనే సంకల్పంతో ఈ ప్రతిష్టాత్మక "స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026" కార్యక్రమాన్ని అమరావతి ప్రధాన కేంద్రం అయిన విజయవాడలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిభను ప్రపంచ వేదికపై నిలబెట్టడంతో పాటు అమరావతి బ్రాండ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ఈ కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో ఈ అవార్డులను రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి విస్తరించి, దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన గౌరవ పురస్కారాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ కృషి చేస్తుందని తెలిపారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రివర్యులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలు, సామాజిక సేవకులు, వివిధ రంగాలకు చెందిన విశిష్టులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు వెల్లడించారు.

ఈ విలేకరుల సమావేశంలో గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీ ఉపాధ్యక్షుడు మిత్తాన ఈశ్వర్, జాయింట్ సెక్రటరీ కోడె శ్రీ చైతన్య, ట్రెజరర్ ఆర్.వి. అప్పారావు, ఈసీ సభ్యులు డా. నవీన్ ఎ. Immanial తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com