భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్కు రూ.4,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
- July 16, 2026
న్యూ ఢిల్లీ: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ టెక్స్–2026 ప్రదర్శన రెండో రోజు ఆంధ్రప్రదేశ్కు రూ.4,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు లభించాయి. విశాఖపట్నంలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఒక ఎంఓయూ కుదిరింది. మరోవైపు రూ.100 కోట్ల పెట్టుబడితో గార్మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు మరో ఎంఓయూ కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ కె. రేఖారాణి ఆధ్వర్యంలో రెండు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి.
భారత్ టెక్స్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఎమ్మెల్యే బైరెడ్డి జయ నాగేశ్వర రెడ్డి సందర్శించి, రాష్ట్రంలోని చేనేత, జౌళి సంస్థలు, నేతన్నల భాగస్వామ్యాన్ని అభినందించారు. ప్రతిపాదిత బనవాసి ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధిపై టెక్స్టైల్ పార్క్ ప్రతినిధులతో చర్చించిన ఆయన, మ్యాజిక్ వీవ్స్ స్టాల్ను సందర్శించి యెమ్మిగనూరు ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలని సూచించారు. పెవిలియన్ను కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ డాక్టర్ ఎం. బీనా, కర్ణాటక ప్రభుత్వం ఎంఎస్ఎంఈ, గనులు, జౌళి, చక్కెర శాఖ కార్యదర్శి రోహిణి సింధూరి, కర్ణాటక టెక్స్టైల్ డెవలప్మెంట్ కమిషనర్ బసవరాజు సందర్శించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రాల మధ్య సహకారం, సామర్థ్య పెంపు, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.
అలాగే ఫ్యాబిండియా కంట్రీ హెడ్ శైలా త్యాగి, రీజినల్ హెడ్ కుల్దీప్ కచ్ఛవాహా, అర్వింద్ లిమిటెడ్, ట్రైడెంట్ గ్రూప్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రతినిధులు, కంచీపురం సిల్క్ పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట రామనాథన్, భారత్ టెక్స్–2026 నిర్వహణ కమిటీ చైర్మన్, టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ యజమాని నరేన్ గోయెంకా, వజీర్ అడ్వైజర్స్ ప్రతినిధులు పెవిలియన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉప్పాడ జమ్దాని, వెంకటగిరి చీరలు సహా ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ, పెట్టుబడులు, కొనుగోలు అవకాశాలపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా కె. రేఖారాణి మాట్లాడుతూ, భారత్ టెక్స్–2026లో రాష్ట్రానికి లభిస్తున్న పెట్టుబడి ప్రతిపాదనలు, పరిశ్రమల నుంచి వస్తున్న స్పందన ఆంధ్రప్రదేశ్ జౌళి రంగంపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. వీటి ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మార్కెట్ అనుసంధానం మరింత బలోపేతం అవుతాయని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







