FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- July 18, 2026
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ఫిక్కీ మహిళా విభాగం (FICCI FLO) ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం శిల్పారామం సమీపంలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.
FICCI FLO (హైదరాబాద్) ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2027లో FICCI శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలను ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. హైటెక్ సిటీ, సీఐఐ కార్యాలయాల మధ్య FICCI FLO ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతం వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రత్యేక కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో కూడా FICCI భాగస్వామ్యం కావాలని కోరిన ముఖ్యమంత్రి, FICCI ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఫార్చూన్–500 కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
FICCI మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో, మహిళల కోసం మరో ప్రత్యేక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే దేశ ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆయన అన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, వారి సమస్యలు, అవసరాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వ్యాపార రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాలను FICCI ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అవార్డులతో సత్కరించాలని సూచించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, FICCI FLO జాతీయ అధ్యక్షురాలు పూజా గార్గ్, FICCI FLO హైదరాబాద్ చైర్పర్సన్ సీతా రెడ్డి గడ్డం, పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







