యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్‌హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర

- July 20, 2026 , by Maagulf
యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్‌హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర

అబుదాబి: యూఏఈలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులకు పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, వీసా, అట్టెస్టేషన్ వంటి కాన్సులర్ సేవల విషయంలో ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు తీసుకుంది. యూఏఈ, కువైట్, సింగపూర్, కేన్బెర్రాలోని భారత రాయబార కార్యాలయాలకు గతంలో టెండర్ ప్రక్రియలో ఎంపికైన సేవా సంస్థలను తాత్కాలికంగా నియమించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

దీంతో అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తాజా టెండర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అల్‌హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కాన్సులర్ సేవలను ప్రారంభించే అవకాశం లభించింది. అవసరమైతే తాత్కాలికంగా ఆ సంస్థ సేవలను వినియోగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సోమవారం వెలువడిన తీర్పులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నాలుగు భారతీయ దౌత్య కార్యాలయాల్లో కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా (CPV) సేవల ఔట్‌సోర్సింగ్ టెండర్ ప్రక్రియను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధానంగా సమర్థించినప్పటికీ, విదేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు సేవలు అంతరాయం కలగకుండా మధ్యంతర ఏర్పాట్లకు అనుమతి ఇచ్చింది.

ప్రస్తుత సేవలందిస్తున్న ఎల్-1 కాంట్రాక్టర్‌ (యూఏఈలో అల్‌హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్) పనితీరు సంతృప్తికరంగా ఉంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా ఆ సంస్థను కొనసాగించవచ్చని, లేక అవసరమైతే మరో సంస్థను కూడా నియమించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ ఏర్పాటు పూర్తిగా తాత్కాలికమేనని, దీనివల్ల ఏ సంస్థకూ శాశ్వత హక్కు లభించదని స్పష్టం చేసింది.

టెండర్ వివాదం ఎలా మొదలైంది?

2025 నవంబర్‌లో అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ భారత కాన్సులేట్‌లో కాన్సులర్ సేవల ఔట్‌సోర్సింగ్ కోసం టెండర్‌ను ఆహ్వానించింది. ఈ ప్రక్రియలో వీఎఫ్‌ఎస్ గ్లోబల్, ఎస్‌జీఐవీఎస్ గ్లోబల్ వంటి సంస్థలతో పాటు కేరళకు చెందిన అల్‌హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా పోటీపడింది. తక్కువ ధరను కోట్ చేసిన అల్‌హింద్‌కు ఒప్పందం దక్కింది.

అయితే టెండర్‌లో ఓడిపోయిన రెండు సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. టెండర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు దానిని రద్దు చేసి, నెల రోజుల్లో కొత్తగా టెండర్ నిర్వహించాలని ఆదేశించింది.

ఈ న్యాయపరమైన వివాదం కారణంగా గత 17 ఏళ్లలో తొలిసారిగా అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ భారత కాన్సులేట్ నేరుగా తమ కార్యాలయాల నుంచే పాస్‌పోర్ట్, వీసా, అట్టెస్టేషన్ సేవలను అందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం కొత్త అధికారిక పోర్టల్ ద్వారా అపాయింట్‌మెంట్ విధానంలో ఈ సేవలు కొనసాగుతున్నాయి.

16 కేంద్రాలతో సిద్ధంగా ఉన్న అల్‌హింద్

ఇదిలా ఉండగా, యూఏఈ వ్యాప్తంగా కాన్సులర్ సేవలు అందించేందుకు తమ సంస్థ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అల్‌హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పటికే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 16 CPV అప్లికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఈ కేంద్రాలు అల్ దానా, అల్ రీమ్, ముసఫ్ఫా, అల్ ఐన్, ఘయాతి, మదీనత్ జాయెద్, బుర్ దుబాయ్, దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్ పార్క్ (DIP), అల్ మజాజ్, రోల్లా, అజ్మాన్, ఫుజైరా, ఉమ్ అల్ ఖువైన్, ఖోర్‌ఫక్కాన్, కల్బా, రాస్ అల్ ఖైమా ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది.

యూఏఈతో పాటు ఇటీవల శ్రీలంకలో కూడా అల్‌హింద్ కాన్సులర్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com