సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- July 21, 2026
దుబాయ్: 15 ఏళ్లలోపు పిల్లలు స్వతంత్రంగా సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండకుండా ప్రతిపాదించిన నిబంధనలు యూఏఈలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రియేటర్ ఎకానమీపై పెద్దగా ప్రభావం చూపవని నేషనల్ మీడియా అథారిటీ (NMA) అధికారులు తెలిపారు. ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం పిల్లలను ఆన్లైన్ దుర్వినియోగం నుంచి రక్షించడం మాత్రమేనని, తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు మరింత సురక్షితంగా డిజిటల్ వేదికలను వినియోగించే అవకాశం కలుగుతుందని నేషనల్ మీడియా అథారిటీ వ్యూహాత్మక ప్రణాళికల డైరెక్టర్ మొహమ్మద్ అల్ జరూనీ పేర్కొన్నారు. ఈ చట్టం 15 ఏళ్లలోపు పిల్లలు స్వతంత్రంగా సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించకుండా ఉండేందుకు ఉద్దేశించబడిందని.. దీని ప్రధాన లక్ష్యం పిల్లలను సైబర్ మోసాల నుంచి రక్షించడమే అని తెలిపారు.
అలాగే, ఈ మార్పుల వల్ల ప్రతికూల ప్రభావం కంటే సానుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయని, తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిన్నారులు సోషల్ మీడియాను మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించే అవకాశం పెరుగుతుందని ఆయన చెప్పారు.
ఈ ప్రతిపాదిత చట్టం ఆన్లైన్లో పిల్లల భద్రతను మెరుగుపరచేందుకు యూఏఈ చేపడుతున్న విస్తృత చర్యల్లో భాగమని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా, యూరప్లోని కొన్ని దేశాలు తీసుకొస్తున్న నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులు మరియు సంబంధిత సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ యూఏఈ తన విధానాలను రూపొందిస్తున్నట్లు టిక్టాక్ నిర్వహించిన "యూఏఈ ఫార్వర్డ్" కార్యక్రమం సందర్భంగా మొహమ్మద్ అల్ జరూనీ వెల్లడించారు.
భద్రతకు ప్రాధాన్యం..
డిజిటల్ ప్లాట్ఫారమ్ల అభివృద్ధిని కొనసాగిస్తూనే సమాజ భద్రతను కాపాడేలా ప్రభుత్వం సమతుల్య విధానాన్ని అనుసరిస్తోందని మొహమ్మద్ అల్ జరూనీ అన్నారు. డిజిటల్ ప్లాట్ఫారమ్ల వృద్ధికి ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని.. భద్రతా అవసరాలు, వ్యాపారవేత్తల అభివృద్ధి రెండింటి మధ్య సమతుల్యతను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
యూఏఈ ఆర్థిక వ్యవస్థకు టిక్టాక్ మద్దతు!
టిక్టాక్ యూఏఈ ఆర్థిక వ్యవస్థకు Dh1.1 బిలియన్ స్థూల విలువ (Gross Value Added - GVA) అందించింది. ఈ ప్లాట్ఫారమ్ ద్వారా సుమారు 7వేల ఉద్యోగాలకు మద్దతు లభించింది.యూఏఈలో 70వేలకుపైగా చిన్న, మధ్య తరహా సంస్థలు (SMEs) టిక్టాక్లో ప్రకటనలు ఇస్తున్నాయి. 10వేల మందికి పైగా వ్యాపారవేత్తలు, అందులో 3,500 మంది మహిళలు, 1,400 మంది ఎమిరాటీలు, టిక్టాక్ ద్వారా ప్రేరణ పొంది తమ వ్యాపారాలను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా విడుదలైన నివేదిక వెల్లడించింది.
ఈ గణాంకాలు యూఏఈలో డిజిటల్ ప్లాట్ఫారమ్లు, క్రియేటర్ ఎకానమీ మరియు చిన్న వ్యాపారాల అభివృద్ధిలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నాయని సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







