సెప్టెంబర్‌లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!

- August 03, 2026 , by Maagulf
సెప్టెంబర్‌లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!

దుబాయ్: అంతర్జాతీయ చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్+ కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్‌తో పాటు మరో నాలుగు సభ్య దేశాలు సెప్టెంబర్ నుంచి రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించాయి.ప్రాంతీయ ఘర్షణల కారణంగా సరఫరా వ్యవస్థలో నెలకొన్న అంతరాయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

మరోవైపు, ఒపెక్+ దేశాలు స్వచ్ఛంద ఉత్పత్తి కోతలను పూర్తిగా ఉపసంహరించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ పెంపు చేపట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న పరిమితుల కారణంగా తక్షణ మార్కెట్ ప్రభావం తక్కువగానే ఉండొచ్చని రిస్టాడ్ ఎనర్జీ అనలిస్టు జార్జ్ లియాన్ అభిప్రాయపడ్డారు. చమురు ఎగుమతులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే సరఫరా పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.

సెప్టెంబర్ ఉత్పత్తి పెంపుతో ఒపెక్+ గతంలో అమలు చేసిన మూడు దశల ఉత్పత్తి కోతల్లో రెండో దశ ఉపసంహరణ పూర్తవుతుంది. ఇకపై కొత్త ఉత్పత్తి మార్పుల విషయంలో కూటమి తొందరపడకపోవచ్చని, నాలుగో త్రైమాసికంలో కొంత విరామం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.కొన్ని సభ్య దేశాలు ఉత్పత్తిని మరింత పెంచాలని భావిస్తున్నప్పటికీ, రష్యా చమురు మౌలిక వసతులపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ప్రభావంతో ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

2022 చివరి నుంచి 2023 వరకు చమురు ధరల పతనంపై ఆందోళన చెందిన ఒపెక్+ మూడు దశల్లో ఉత్పత్తి కోతలు అమలు చేసింది. దీని ద్వారా రోజుకు దాదాపు 6 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉత్పత్తిని తగ్గించింది. అయితే 2025 నుంచి వ్యూహాన్ని మార్చుకుని క్రమంగా ఉత్పత్తిని పెంచుతూ వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com