US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

- August 05, 2026 , by Maagulf
US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలో భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణ అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.ముఖ్యంగా ఉన్నత విద్య, పెట్టుబడులు, ఐటీ రంగం, వీసా ప్రక్రియలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఉన్నత విద్యను అభ్యసించేందుకు:
సమావేశంలో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏడాది తెలంగాణ నుంచి వేలాది మంది విద్యార్థులు వెళ్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర విద్యార్థులకు స్టూడెంట్ వీసాల మంజూరులో మరింత సౌలభ్యం కల్పించడంతో పాటు, వీసాల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని అమెరికా రాయబారిని కోరారు. దీంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

అలాగే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని, వీసా రెన్యువల్‌ను వేగవంతం చేసి సులభతరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీసా ప్రక్రియలో జాప్యం కారణంగా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, ఔషధ, సెమీకండక్టర్, డేటా సెంటర్ రంగాల గురించి కూడా ముఖ్యమంత్రి వివరించారు. అమెరికా కంపెనీలు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని ఆయన కోరినట్లు సమాచారం.

ఈ భేటీ భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలోనే కాకుండా, తెలంగాణ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే అంశాల పై జరిగిన కీలక సమావేశంగా రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.రానున్న రోజుల్లో ఈ చర్చల ఫలితంగా విద్య, ఉపాధి,పెట్టుబడుల రంగాల్లో మరిన్ని అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com