పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- August 06, 2026
పంజాబ్ రాష్ట్రంలో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన ప్రత్యర్థులపై స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ విజయావకాశాల్లో ముందంజలో ఉంది. అయినప్పటికీ 2022 ఎన్నికల తరహాలో ఏకపక్ష తీర్పు కాకుండా ఈసారి ఎన్నికల సమరం పోటీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 58 నుండి 63 సీట్లు గెలుచుకుని సాధారణ మేజారిటీ మార్కుకు అతిచేరువగా లేదా స్వల్పంగా దాటే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే అంచనా వేసింది. ప్రతిపక్షంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 36 నుండి 43 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉన్నది. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న 'వారిస్ పంజాబ్ దే' ( డబ్ల్యూడీ) పార్టీ 4 నుండి 7 సీట్లు గెలుచుకుని గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2 నుండి 6 సీట్లు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) 2 నుండి 4 సీట్లు గెలుపొందే అవకాశాలుండగా, ఇండిపెండెంట్లు, ఇతరులు మిగిలిన స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.
పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 37 శాతం, కాంగ్రెస్ 31 శాతం, వారిస్ పంజాబ్ దే 14 శాతం, బీజేపీ 8 శాతం, శిరోమణి అకాలీదళ్ 6 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే పేర్కొంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలాంటి ముందస్తు పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతాయనే ప్రాతిపదికన ఈ అంచనాలు రూపొందించడం జరిగింది.
2022 నాటి ఏకపక్ష అనుకూల వేవ్ నుంచి పంజాబ్ రాజకీయాలు ఇప్పుడు ప్రభుత్వ పాలనా పనితీరు ప్రాతిపదికగా జరిగే పోరు వైపు మళ్లాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. గత ఎన్నికల్లో సాంప్రదాయ పార్టీలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆప్ కు అనుకూల ప్రభంజనాన్ని సృష్టించగా, ఈసారి మాత్రం ఓటర్లు ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగ నిర్మూలన-ఉపాధి కల్పన, వ్యవసాయ విధానాలు, ఆర్థిక నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాజకీయ నాయకుల విశ్వసనీయత ఆధారంగానే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 40 శాతం మంది ఓటర్లు ఆయనకే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంటూ మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీకి 33 శాతం మంది మద్దతు లభించగా, అమృత్పాల్ సింగ్కు 13 శాతం మంది మద్దతు తెలిపారు. ఇతర నాయకులకు అత్యల్ప ప్రజాదరణ లభించింది.
ఈ సర్వేలోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే... ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పట్ల ఉన్న ప్రజాదరణకు, క్షేత్రస్థాయిలోని ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఉన్న అసంతృప్తికి మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత తక్కువగా ఉన్నప్పటికీ, అనేక నియోజకవర్గాలలో ఆప్ ఎమ్మెల్యేలపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందే ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశమిస్తే ఆప్ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని ఈ మూడ్ సర్వేలో వెల్లడయింది. ప్రభుత్వంపై కాకుండా స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే ఓటర్ల ప్రవర్తనను శాసించనున్నట్లు సర్వే అంచనా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలమైన గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణాత్మక బలాన్ని కలిగి ఉండి, ఆప్కు ప్రధాన సవాలుగా నిలుస్తోంది. కాంగ్రెస్ నాయకుల్లో మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకే అత్యధిక ప్రజాదరణ ఉన్నట్లు ఈ సర్వే వెల్లడయింది. కాంగ్రెస్ పార్టీ చన్నీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, పార్టీలోని అంతర్గత విబేధాలను నియంత్రిస్తూ సరైన అభ్యర్థులను పోటీలో నిలబెడితే అనేక నియోజకవర్గాల్లో ఆప్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) రాజకీయ ప్రభావం రోజురోజుకీ క్షీణిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. అకాలీదళ్కు సాంప్రదాయ ఓటుబ్యాంక్గా ఉన్న సిక్కు 'పంథిక్' ఓటర్లు, ముఖ్యంగా అమృత్సర్, గుర్దాస్పూర్, తరణ్ తారన్ వంటి సరిహద్దు జిల్లాల్లోని యువ సిక్కు ఓటర్లు వేగంగా 'వారిస్ పంజాబ్ దే' వైపు మొగ్గు చూపుతున్నారు. మత్తు పదార్థ రహిత పంజాబ్, సిక్కు అస్తిత్వ అంశాలపై స్పష్టమైన ప్రచారం చేయడంతో 'వారిస్ పంజాబ్ దే' కొన్ని ప్రాంతాల్లో కీలక శక్తిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దీని ప్రభావం పరిమితంగా ఉన్నప్పటికీ, కొన్ని కీలక నియోజకవర్గాల్లో సాంప్రదాయ ఓట్ల విధానాన్ని మార్చడం ద్వారా ఫలితాలను తలకిందులు చేసే సామర్థ్యం ఈ ఈ పార్టీకి ఉన్నది.
బిజెపి పంజాబ్లో తన దీర్ఘకాలిక విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తున్నది. లూథియానా, జలంధర్, అమృతసర్, హోషియార్పూర్, పటియాలా, ఎస్.ఎ.ఎస్ నగర్ (మొహాలి) వంటి ప్రధాన పట్టణ నియోజకవర్గాల్లో పార్టీ ఓటు బ్యాంకు విస్తరించేందుకు కృషి చేస్తున్నది. పట్టణ ప్రాంత హిందూ ఓటర్లు, వ్యాపారులు, చదువుకున్న యువతలో ఆదరణ పెరిగినప్పటికీ, సిక్కు రైతాంగంలో తిరిగి నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడం బీజేపీకి అతిపెద్ద సవాలుగా మిగిలిపోయింది. దీంతో కొన్ని పట్టణ స్థానాల్లో సీట్లు సాధించే అవకాశం ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మార్పును సృష్టించే పరిస్థితి బీజేపీకి ఇంకా రాలేదు.
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు కొంతమంది ఎంపీలు, ముఖ్య నేతలు ఆప్ ని వీడటం పట్టణ ప్రాంతాల్లో రాజకీయంగా చర్చనీయాంశమైనప్పటికీ, ఎన్నికల ఫలితాలపై దీని తక్షణ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని సర్వే నిర్ధారించింది. ఈ చేరికలు పట్టణ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, సాధారణ ఓటర్ల ప్రాధాన్యతల్లో పెద్దగా మార్పు తేలేదు. ముఖ్యంగా గ్రామీణ పంజాబ్లో వ్యవసాయం, ఉపాధి, పాలన, స్థానిక అభ్యర్థుల బలం మాత్రమే ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి.
డేరా సచ్చా సౌదా, రాధా స్వామి సత్సంగ్ బియాస్, డేరా సచ్ ఖండ్ బల్లాన్, నామ్ధారి , నిరంకారి వంటి డేరాలు పంజాబ్లోని మాల్వా, దోఆబా ప్రాంతాల్లో దాదాపు సగం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజికంగా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. డేరాలు నేరుగా ఏ పార్టీకీ ఓటు వేయాలని ఆదేశాలు ఇవ్వకపోయినా, వారి సామాజిక ప్రభావం దగ్గరగా జరిగే పోటీల్లో ఫలితాలను ప్రభావితం చేస్తుంది. డేరాలతో మెరుగైన సంబంధాల వల్ల బీజేపీకి కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, అది మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద విజయాన్ని కట్టబెట్టలేదని సర్వే విశ్లేషించింది.
మొత్తంగా చూస్తే, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధాంతాల కంటే ఎక్కువగా ప్రజాపాలన, నాయకత్వ విశ్వసనీయత, అభ్యర్థుల ఎంపిక మరియు స్థానిక సమస్యల ఆధారంగానే జరగనున్నాయి. ఏకపక్ష ప్రభంజనాలు లేకుండా వందలాది నియోజకవర్గాల్లో హోరాహోరీ స్థానిక పోటీలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, సంస్థాగత బలం, ప్రజల అంచనాలకు తగినట్లుగా స్పందించే తీరుపైనే అంతిమ విజయం ఆధారపడి ఉంటుంది.
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజన్ పాండే పర్యవేక్షణలో, సీనియర్ పరిశోధకుడు శ్రీ అమిత్ ఓహ్లాన్ సమన్వయంలో 24 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లతో కూడిన 6 బృందాలు జూన్ 20 నుండి జూలై 31, 2026 వరకు (45 రోజుల పాటు) పంజాబ్లోని మాల్వా, మాఝా, దోఆబా ప్రాంతాలలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించాయి. 'సిస్టమాటిక్ స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్' పద్ధతిలో వివిధ సామాజిక వర్గాలు, వృత్తులు, వయస్సు, ఆర్థిక నేపథ్యాలు కలిగిన ఓటర్లతో ముఖాముఖి సంభాషించి మొత్తం 8,000 మంది ప్రతినిధుల నుండి శాంపిల్స్ సేకరించి ఈ నివేదికను తయారు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







