అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్..!!

- August 06, 2026 , by Maagulf
అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్..!!

అబుదాబి: భారత్–యూఏఈ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుభవార్త అందించింది. అబుదాబి నుంచి భారతదేశంలోని మరో నాలుగు నగరాలకు తన విమాన సేవలను విస్తరిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. విస్తరించిన షెడ్యూల్‌లో భాగంగా  నవీ ముంబై, ఇండోర్, లక్నో నగరాలకు నాన్‌స్టాప్ విమాన సర్వీసులను ఇప్పటికే ప్రారంభించింది. అలాగే ఆగస్టు 7 నుంచి గువాహటికి కూడా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుంది. దీంతో ఈశాన్య భారత ప్రాంతానికి అబుదాబి నుంచి ప్రత్యక్ష విమాన అనుసంధానం ఏర్పడనుంది. వ్యాపార, పర్యాటక ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ చేపట్టినట్లు సంస్థ తెలిపింది. ఈ కొత్త సర్వీసులతో యూఏఈ రాజధాని అబుదాబి నుంచి భారతదేశంలోని ప్రధాన నగరాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

అబుదాబి ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ అహ్మద్ జుమా అల్ షమీసీ మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త మార్గాల ప్రారంభం జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం గమ్యస్థానాల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంలో కీలకంగా నిలుస్తుందని, భారత్–యూఏఈ మధ్య పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడంలో ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. అబుదాబి సర్వీసుల ప్రారంభంతో నవీ ముంబై నుంచి వారానికి 30 విమానాలు నడపనున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..ఈ మార్గాన్ని అబుదాబి, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో అనుసంధానించనుంది.

మహారాష్ట్రలో ఇప్పటికే ముంబై నుంచి వారానికి 95కి పైగా, పుణే నుంచి 100కు పైగా, నాగ్‌పూర్ నుంచి 14 వారాంత విమానాలను సంస్థ నిర్వహిస్తోంది. అదేవిధంగా బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలను భారత్ లోని పలు నగరాలతో అనుసంధానించే అతిపెద్ద ఇండియా–పశ్చిమ ఆసియా విమాన నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొనసాగుతోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com