ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!

- August 06, 2026 , by Maagulf
ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!

దోహా: ఖతార్‌లోకి వచ్చే లేదా ఖతార్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు వ్యక్తిగత వినియోగం కోసం కంట్రోల్డ్ మెడిసిన్స్ ను తీసుకెళ్లేందుకు ఇకపై ముందస్తు అనుమతిని ఆన్‌లైన్‌లో పొందే అవకాశం కల్పిస్తూ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) కొత్త ఎలక్ట్రానిక్ పర్మిట్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు, దరఖాస్తు పురోగతిని ట్రాక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. అనుమతి మంజూరైన తర్వాత ఈ-పర్మిట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలోనే అందజేస్తారు.

ఈ విధానం వల్ల అనుమతి ప్రక్రియ మరింత వేగవంతం కావడంతో పాటు, ప్రయాణికులకు సులభమైన సేవలు అందుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికుల కోసం ఈ వ్యవస్థ వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, సేవలను పొందే విధానం, అలాగే నియంత్రిత మందుల జాబితా వంటి వివరాలను పొందుపరిచారు.

అన్ని అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత దరఖాస్తును మూడు పని దినాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రయాణ తేదీకి కనీసం ఐదు పని దినాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈ-పర్మిట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు నేషనల్ ఆథెంటికేషన్ సిస్టమ్ ద్వారా లాగిన్ అయి, చెల్లుబాటు అయ్యే వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తో పాటు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. అనంతరం ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలోని ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగం దరఖాస్తును పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా అనుమతిని జారీ చేస్తుంది.

ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటలీకరించి వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com