అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!

- August 08, 2026 , by Maagulf
అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!

అబుదాబి: అమెరికాలో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన లెట్యూస్ ఉత్పత్తులు యూఏఈ మార్కెట్లలో లేవని యూఏఈ వాతావరణ మార్పులు మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశంలో విక్రయిస్తున్న ఆహార ఉత్పత్తుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో ప్రస్తుతం సైక్లోస్పోరియాసిస్ (Cyclosporiasis) అనే పరాన్నజీవి వల్ల ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవుతున్నాయి. కలుషిత నీరు, అలాగే శుభ్రంగా కడగని బెర్రీలు, ఆకుకూరలు, లెట్యూస్ వంటి తాజా కూరగాయల ద్వారా ఈ పరాన్నజీవి వ్యాపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రత్యేకంగా మెక్సికో మధ్య ప్రాంతం నుంచి దిగుమతి అయిన లెట్యూస్‌పై అమెరికాలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, యూఏఈ అధికారులు దేశంలోకి వచ్చే ఆహార ఉత్పత్తులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. అత్యున్నత ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సైక్లోస్పోరియాసిస్ లక్షణాలు
ఈ వ్యాధి సోకిన వారికి ప్రధానంగా తీవ్రమైన నీటి విరేచనాలు వస్తాయి.
* ఆకలి తగ్గడం
* కడుపు ఉబ్బరం
* తీవ్రమైన అలసట
* స్వల్ప జ్వరం
* కడుపు నొప్పి
* వికారం
* వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ప్రజలకు సూచనలు
తాజా పండ్లు, కూరగాయలను తినే ముందు శుభ్రంగా కడగాలని, గుర్తింపు పొందిన దుకాణాల నుంచే ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలని యూఏఈ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఇదిలా ఉండగా, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో సైక్లోస్పోరియాసిస్ కేసులు నమోదవడంతో, టేలర్ ఫార్మ్స్ డి మెక్సికో సంస్థ మధ్య మెక్సికో నుంచి సరఫరా చేసిన ఐస్‌బర్గ్ లెట్యూస్ ఉత్పత్తులను రీకాల్ చేసింది. ఈ ఉత్పత్తులు కనీసం 27 అమెరికా రాష్ట్రాల్లో విక్రయించబడినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com