ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!

- August 08, 2026 , by Maagulf
ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!

మనామా: బహ్రెయిన్‌లోని హమద్ టౌన్ బ్లాక్-1205 ప్రాంతంలో ప్రతిపాదించిన రెండు మసీదుల నిర్మాణం స్థలాల నమోదు ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఎనిమిదేళ్లుగా నిలిచిపోయింది. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్లా ముబారక్ బెలాల్ అల్ ఖుబైసీ మాట్లాడుతూ.. ఈ అంశంపై గత ఎనిమిదేళ్లుగా నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, జాఫరీ వక్ఫ్ డైరెక్టరేట్‌లో ముగ్గురు డైరెక్టర్లు మారినా ఎలాంటి పురోగతి లేదని తెలిపారు.

రోడ్ 536లో నిర్మించాల్సిన ఇమామ్ అల్ మహ్దీ గ్రాండ్ మసీదు, రోడ్ 535లో ప్రతిపాదించిన ఖతమ్ అల్ అన్‌బియా మసీదు కోసం కేటాయించిన స్థలాల విషయంలో జాఫరీ వక్ఫ్ డైరెక్టరేట్, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, సర్వే అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ బ్యూరో, హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖలతో పలుమార్లు సమావేశాలు, స్థల పరిశీలనలు జరిగినప్పటికీ నమోదు ప్రక్రియ పూర్తి కాలేదని పేర్కొన్నారు.

ప్రతి సారి హామీలు మాత్రమే ఇస్తున్నారని, కానీ ఆచరణలో ఎలాంటి చర్యలు కనిపించడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థలాల నమోదును వెంటనే పూర్తి చేసి అవసరమైన పత్రాలు జారీ చేసి మసీదుల నిర్మాణాన్ని ప్రారంభించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, కౌన్సిల్ సభ్యుడు అల్ ఖుబైసీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు మసీదులు బ్లాక్-1205 ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక అవసరాలను తీర్చేందుకు ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com