హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్‌పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది

- August 08, 2026 , by Maagulf
హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్‌పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది

రియాద్: హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) చమురు ట్యాంకర్‌పై జరిగిన ఇరాన్ దాడిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సెక్రటరీ జనరల్ జాసెం అల్‌బుదైవీ తీవ్రంగా ఖండించారు.

ఈ దాడి అత్యంత ప్రమాదకరమైన పరిణామమని, ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యగా అభివర్ణించారు. అంతర్జాతీయ సముద్ర రవాణా, వాణిజ్యానికి ఇది ప్రత్యక్ష ముప్పు అని ఆయన పేర్కొన్నారు.

శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అల్‌బుదైవీ మాట్లాడుతూ, ప్రపంచానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఒత్తిడి, బెదిరింపుల సాధనంగా మార్చేందుకు ఇరాన్ చేస్తున్న ఎలాంటి ప్రయత్నాలనైనా జీసీసీ పూర్తిగా తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు.

ఇలాంటి దాడులను తక్షణమే నిలిపివేయడానికి, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా అడ్డుకోవడానికి అంతర్జాతీయ సమాజం దృఢమైన వైఖరి అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలు, సముద్ర చట్టం, సంబంధిత అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు.

హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన జలమార్గమని, అక్కడ నౌకాయాన స్వేచ్ఛ, భద్రతను కాపాడటం అంతర్జాతీయ సమాజం బాధ్యత అని అల్‌బుదైవీ పేర్కొన్నారు.

చివరగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు జీసీసీ పూర్తి సంఘీభావాన్ని పునరుద్ఘాటించారు. యూఏఈ తన భద్రత, సార్వభౌమత్వం, ఆస్తులు, జాతీయ ప్రయోజనాలను రక్షించుకునేందుకు తీసుకుంటున్న అన్ని చర్యలకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com