పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!

- August 10, 2026 , by Maagulf
పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం (ఆగస్టు 9) వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకున్న కేసీఆర్.. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ (KCR) ప్రకటించిన రూ.2.25 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను కూడా స్వయంగా సంతకం చేసి ఆయన అందించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమారుడు, కుమార్తెకు చెరో రూ.కోటి చొప్పున ఆయన తల్లిదండ్రులకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు.

కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి బీఆర్ఎస్ కోసం ఎంతో శ్రమించారు. వరంగల్‌లో కేసీఆర్ ముఖ్య అనుచరుడిగా కూడా కొనసాగారు. ఆయన మృతితో కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

అయితే, కేసీఆర్ పర్యటన సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నర్సంపేటకు వెళ్తున్న సమయంలో దారి పొడవునా కేసీఆర్‌కు అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేలా కేసీఆర్ వ్యవహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com