లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి

- August 13, 2026 , by Maagulf
లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి

అమరావతి: లేటరైట్ ఖనిజాన్ని బాక్సైట్‌గా వర్గీకరించి మేజర్ మినరల్‌గా మార్చారనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లేటరైట్ ఖనిజం వర్గీకరణలో ఇటీవల ఎలాంటి మార్పు చేయలేదని కేంద్ర గనుల శాఖ స్పష్టం చేసినట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

ఈ అంశంపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర గనుల శాఖ సమాధానం ఇచ్చింది. 2018 ఏప్రిల్ 25న ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM) జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా బాక్సైట్‌కు సంబంధించిన థ్రెషోల్డ్ విలువలను మాత్రమే నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించింది.

నోటిఫికేషన్ ప్రకారం అల్యూమినస్ లేటరైట్‌లో అల్యూమినా (Al₂O₃) కనీసం 20 శాతం, బాక్సైట్‌లో అల్యూమినా 30 శాతం ఉండటంతో పాటు సిలికా గరిష్ఠంగా 7 శాతం ఉండాలనే ప్రమాణాలను కేంద్రం వివరించింది.

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026 మే 26న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయగా, దానిని పరిశీలించిన కేంద్రం జూలై 3న సమాధానం ఇచ్చినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. లేటరైట్ ఖనిజానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టలేదని ఆ సమాధానంలో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

అలాగే మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, బారైట్స్ వంటి ఖనిజాల మాదిరిగా లేటరైట్ వర్గీకరణలో ఎలాంటి మార్పు జరగనందున ట్రాన్సిషన్ పీరియడ్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లు బాలశౌరి వెల్లడించారు.

లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా రాష్ట్ర ప్రజలు, గనుల రంగానికి సంబంధించిన అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసేలా కేంద్రం నుంచి స్పష్టమైన వివరణ తీసుకురాగలిగామని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com