బహ్రెయిన్లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- August 19, 2026
బహ్రెయిన్: బహ్రెయిన్లో మంగళవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఓ తల్లి, ఆమె ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
రమ్లీ హౌసింగ్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 27 ఏళ్ల మహిళతో పాటు ఐదేళ్లు, మూడేళ్లు, ఏడాది వయసున్న ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
ప్రమాదం జరిగిన సమయంలో తండ్రి ఇంట్లో లేరు. మృతుల తండ్రి హసన్ అబ్దుల్ ఆల్అల్ ఒటైఫీకి బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంటలను అదుపులోకి తెచ్చిన సివిల్ డిఫెన్స్
అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సివిల్ డిఫెన్స్ బృందాలు, అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అనంతరం మంటలు తిరిగి చెలరేగకుండా అవసరమైన కూలింగ్ ఆపరేషన్లు నిర్వహించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఐదేళ్ల చిన్నారిని సిబ్బంది గుర్తించిన సమయంలో అతనిలో స్వల్పంగా నాడి స్పందన ఉన్నప్పటికీ, అనంతరం మరణించాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు, తల్లి మాత్రం సహాయక బృందాలు అక్కడికి చేరుకునే సమయానికే మృతి చెందినట్లు సమాచారం.
భవనంలోని ఇతర నివాసులను సురక్షితంగా బయటకు తరలించి, వారికి తాత్కాలిక వసతి కల్పించారు. తన కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసిన షాక్తో తండ్రిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
విద్యుత్ భద్రతపై అధికారుల హెచ్చరిక
అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచించారు.
ప్రజలు అగ్నిప్రమాద నివారణ, ప్రజా భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. భవన యజమానులు, నిర్వహణ సంస్థలు ఫైర్ అలారాలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు.
చిన్నారుల విషయంలో అప్రమత్తత అవసరం
చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టవద్దని కుటుంబాలకు అధికారులు సూచించారు. విద్యుత్ పరికరాలు, స్టవ్లు, ఓవెన్ల వద్దకు పిల్లలు వెళ్లకుండా, వాటితో ఆడుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఈ విషాద ఘటన నేపథ్యంలో ఇళ్లలో అగ్నిప్రమాద నివారణ చర్యలు, ముఖ్యంగా విద్యుత్ భద్రతపై అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి స్పష్టమైంది.
తాజా వార్తలు
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా
- బహ్రెయిన్లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్తో పోలీసుల భాగస్వామ్యం
- ఏపీ మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధం..
- జెడ్డాలో ‘ఇండియా ఉత్సవ్’లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి
- గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం
- తప్పుదారి పట్టించిన డ్రైవింగ్.. అబుదాబిలో డ్రైవర్కు 6 నెలల జైలు, Dh100,000 జరిమానా







