బహ్రెయిన్‌లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!

- August 23, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!

మనామా: బహ్రెయిన్‌లో ప్రసిద్ధ వేసవి ఫ్రూట్ ‘లోజ్’ ధరలు భారీగా పెరిగాయి. సరఫరా తగ్గడం, మండుతున్న ఎండలు, పెరిగిన డిమాండ్‌ కారణంగా కొన్ని రకాల లోజ్ పండ్ల ధర కిలోకు ఏకంగా BD10కు చేరింది. లోజ్ రకం, నాణ్యతను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటోందని విక్రేతలు చెప్పారు. ప్రస్తుతం హబ్బాన్‌ సీజన్ ముగియడంతో, అలెగ్జాండ్రియన్ లోజ్ మార్కెట్‌కు చేరుకునే మధ్యలో సుమారు 10 నుంచి 12 రోజుల పాటు సరఫరా గణనీయంగా తగ్గింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం ఎరుపు, పసుపు రంగుల్లో ఉండే అలెగ్జాండ్రియన్ లోజ్ మార్కెట్‌లోకి వస్తోంది. దీని సీజన్ అక్టోబర్ మధ్య వరకు కొనసాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

జ్యూస్ షాపులు, ఐస్‌క్రీమ్ తయారీదారుల నుంచి డిమాండ్

లోజ్ కొరతే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఓ రైతు తెలిపారు. అదే సమయంలో జ్యూస్ షాపులు, ఐస్‌క్రీమ్ తయారీదారులు పెద్ద మొత్తంలో పండ్లను కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నిల్వలు మరింత తగ్గుతున్నాయని చెప్పారు. బహ్రెయిన్‌కు వెలుపల నుంచి వచ్చే కొనుగోలుదారులు కూడా డిమాండ్‌ను పెంచుతున్నారని తెలిపారు.

మండుతున్న ఎండలతో పంటకు నష్టం

భారీ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన సూర్యరశ్మి లోజ్ సాగు చేస్తున్న రైతులకు మరో సమస్యగా మారాయి. చెట్లపై ఉన్న పండ్లపై అధిక వేడి ప్రభావం చూపడంతో కొంత పంట దెబ్బతిని విక్రయానికి పనికిరాకుండా పోతున్నట్లు రైతులు చెబుతున్నారు. లోజ్ విక్రేత అబు అలీ మాట్లాడుతూ.. ఎండల కారణంగా రైతులు పండ్లను తెల్లవారుజామునే కోయాల్సి వస్తోందన్నారు. అధిక ఉష్ణోగ్రతల్లో వ్యవసాయ పనులు చేయడం మరింత కష్టంగా మారిందని పేర్కొన్నారు.

బహ్రెయిన్ లోజ్‌కు ప్రత్యేక డిమాండ్

రుచి, నాణ్యత కారణంగా స్థానిక బహ్రెయిన్ లోజ్‌కు వినియోగదారుల నుంచి అత్యధిక డిమాండ్ ఉంటోందని విక్రేతలు తెలిపారు. బహ్రెయిన్‌కు వచ్చే సందర్శకులు కూడా పెద్ద మొత్తంలో లోజ్ కొనుగోలు చేసి తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారని వ్యాపారులు తెలిపారు.

అనధికార విక్రయాలపై రైతుల ఆందోళన

మరోవైపు, లైసెన్స్‌తో సాగు చేస్తున్న రైతులు, అధికారికంగా వ్యాపారం నిర్వహిస్తున్న విక్రేతలు వీధి వ్యాపారుల కారణంగా అదనపు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. కొంతమంది వీధి వ్యాపారులు విదేశాల నుంచి లోజ్‌ను దిగుమతి చేసుకుని, అనుమతులు ఉన్న దుకాణాల సమీపంలో స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. అయితే లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు దుకాణాల అద్దెలు, రిజిస్ట్రేషన్‌, నిర్వహణ వంటి అదనపు ఖర్చులను భరించాల్సి వస్తోందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com