అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- August 26, 2026
అల్ ఐన్: పాఠశాలలు పునఃప్రారంభం కానున్న వేళ అల్ ఐన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పార్క్ సమీపంలో ఉన్న వాటర్ కూలర్ను తాకడంతో విద్యుత్ షాక్కు గురైన 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతుడిని అరబ్ ప్రవాస కుటుంబానికి చెందిన వలీద్ ఖాలెద్గా గుర్తించారు. కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న వలీద్.. స్కూల్ బ్యాగ్, స్టేషనరీని సిద్ధం చేసుకోవడంతో పాటు స్కూల్ స్పోర్ట్స్ యూనిఫాం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
అయితే పాఠశాల ప్రారంభం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న బాలుడి కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వలీద్ తన అన్నయ్య, స్నేహితులతో కలిసి ఇంటికి సమీపంలోని పార్క్కు ఆడుకోవడానికి వెళ్లాడు.
ఈ సమయంలో ఒక బాలుడు సమీపంలోని ఓ ఇంటి బయట ఉన్న వాటర్ కూలర్ వద్దకు వెళ్లాడు. పిల్లలు గతంలో కూడా ఆ కూలర్ నుంచి నీరు తాగేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. కూలర్ను తాకగానే ఆ బాలుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు.
వలీద్ అన్నయ్య అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. వలీద్కు అది సరదాగా చేసిన పనేమోనని అనిపించి, ఏమైందో తెలుసుకునేందుకు కూలర్ దగ్గరకు వెళ్లాడు. అయితే కూలర్ను తాకగానే అతనికి కూడా విద్యుత్ ప్రవాహం తగిలినట్లు అనిపించింది. వెంటనే చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత వలీద్ కూలర్ను తాకడంతో విద్యుత్ షాక్కు గురై కుప్పకూలిపోయాడు.
భయంతో అహ్మద్ వెంటనే ఇంటికి పరుగెత్తుకెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న వలీద్ను ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.
విద్యుత్ భద్రత పై హెచ్చరికలు
ఈ ఘటనతో పిల్లలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరిగా నిర్వహణ చేయని లేదా లోపభూయిష్టంగా ఉన్న విద్యుత్ పరికరాలు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పార్కులు, నివాస ప్రాంతాలు, పాఠశాలల సమీపంలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్లు, ఇతర విద్యుత్ పరికరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, లోపాలు కనిపిస్తే వెంటనే మరమ్మతులు చేయడం ఎంతో కీలకమని సూచిస్తున్నారు.
పాఠశాలలో విషాద ఛాయలు
వలీద్ మృతితో అతను చదువుతున్న పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది బాలుడికి నివాళులు అర్పించారు.
వలీద్ ఎంతో మర్యాదగా, దయగల మనసుతో ఉండేవాడని, తోటి విద్యార్థులతో ఎంతో స్నేహంగా మెలిగేవాడని పాఠశాల సిబ్బంది గుర్తుచేసుకున్నారు. అతని తల్లిదండ్రులు, సోదరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







