స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

- September 01, 2026 , by Maagulf
స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక పోరులో ఓటమి భయం ఆవహించడంతోనే YCP నాయకుల్లో వణుకు మొదలైందని, అందుకే ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు జరపాలంటూ కొత్త సాకులు వెతుక్కుంటూ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. “ఎక్కడా ఏకగ్రీవాలు జరగవద్దని YCP చెబుతోంది.. కానీ, స్థానిక ప్రజలే ఏకగ్రీవాన్ని కోరుకుంటే మీరు ఎలా అడ్డుకుంటారు?” అని సూటిగా ప్రశ్నించారు. గతంలో జరిగిన దౌర్జన్యాలు, బలవంతపు ఏకగ్రీవాలకు భిన్నంగా ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజల తీర్పు ఉంటుందని స్పష్టం చేశారు.

త్వరలోనే మహిళలకు ఉచిత ఏసీ బస్సు ప్రయాణం..సీఎం

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నికల్లో జరుగుతున్న క్యాంప్ రాజకీయాలు, ‘ఆయారాం-గయారాం’ తరహా నేతల తీరు వల్ల స్థానిక పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఈ అస్థిరతకు, గుర్రపు బేరాలకు చెక్ పెట్టేందుకే మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ల స్థానాలకు నేరుగా ప్రజలే ఓటు వేసే ‘ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని’ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉంటేనే పట్టణాల్లో జవాబుదారీతనం, పారదర్శకమైన పాలన సాధ్యమవుతుందని బాబు వివరించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధే శ్రీరామరక్షగా స్థానిక పోరును ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com