గణేష్‌ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్

- September 01, 2026 , by Maagulf
గణేష్‌ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్‌: గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక సమావేశం నిర్వహించింది. గణేష్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పాటు ఖైరతాబాద్‌ గణేష్‌ వంటి భారీ విగ్రహాల నిర్వాహక కమిటీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రవాణా, బీసీ సంక్షేమం, హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ కూడా సమావేశానికి హాజరై గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనానికి సంబంధించిన భద్రతా చర్యలపై కీలక సూచనలు చేశారు.

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లలో తనకు 14 ఏళ్ల అనుభవం ఉందని, అందులో 10 సార్లు నగర పోలీసు విభాగంలో డీసీపీ, అదనపు కమిషనర్‌, కమిషనర్‌ హోదాల్లో నిమజ్జన బందోబస్తును పర్యవేక్షించినట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

నిమజ్జన బందోబస్తును ఆరు దశల్లో నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఉత్సవ నిర్వాహకులు పాటించాల్సిన బాధ్యతలు, గణేష్‌ మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిమజ్జన సమయంలో భద్రతా ప్రమాణాలపై ఆయన సూచనలు చేశారు.

ముఖ్యంగా పోలీసు, మున్సిపల్‌ అధికారుల మధ్య సమన్వయం అత్యంత కీలకమని డీజీపీ పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో అవసరమైన క్రేన్లను ముందుగానే ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. అనంతరం గణేష్‌ ఉత్సవ కమిటీలు, భారీ విగ్రహాల నిర్వాహకులు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులు వాటికి సమాధానాలు ఇచ్చారు.

గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు, మున్సిపల్‌ శాఖలు, ఇతర ప్రభుత్వ విభాగాలు, ఉత్సవ నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సమావేశం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com