రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!

- September 05, 2026 , by Maagulf
రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!

రియాద్: యూరోపియన్ యూనియన్ (EU), గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నేతల రెండో శిఖరాగ్ర సదస్సుకు సౌదీ అరేబిaయా ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 అక్టోబర్ 24న ఈ సదస్సు జరగనుంది. ఇరు కూటముల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రాజకీయ, ఆర్థిక సహకారాన్ని విస్తరించడం సదస్సు ప్రధాన లక్ష్యంగా ఉందని పేర్కొంది. ఈ సదస్సుకు యూరోపియన్ యూనియన్‌లోని 27 సభ్య దేశాల నేతలు, గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేతలు హాజరుకానున్నారు.

యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా సదస్సుకు సహ అధ్యక్షత వహించనున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ కూడా ఈయూ తరఫున పాల్గొంటారు. ఈయూ-జీసీసీ వ్యూహాత్మక భాగస్వామ్యం రాజకీయ చర్చలు, సమన్వయం, పరస్పర సహకారంపై ఆధారపడి ఉందని కోస్టా పేర్కొన్నారు. ప్రపంచ, ప్రాంతీయ శాంతి, భద్రత, సుసంపన్నత కోసం ఈ భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

2024 అక్టోబర్ 16న బ్రస్సెల్స్‌లో జరిగిన తొలి ఈయూ-జీసీసీ సదస్సు జరిగింది. ఇరు ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. ఈయూకి జీసీసీ దేశాలు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నాయి. 2025లో ఈయూ-జీసీసీ మధ్య వస్తువుల వాణిజ్యం €165.6 బిలియన్లకు చేరింది. ఇందులో ఈయూ నుంచి గల్ఫ్ దేశాలకు సుమారు €110 బిలియన్ల ఎగుమతులు, జీసీసీ నుంచి ఈయూకు €55.6 బిలియన్ల దిగుమతులు ఉన్నాయి.

గత దశాబ్దంలో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం దాదాపు 30 శాతం పెరిగింది. గల్ఫ్ దేశాల నుంచి ఈయూ దిగుమతులు సుమారు 54 శాతం పెరగగా, ఈయూ ఎగుమతులు దాదాపు 20 శాతం వృద్ధి చెందాయి. జీసీసీ నుంచి ఈయూ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఇంధన ఉత్పత్తుల వాటా 75 శాతానికి పైగా ఉంది. సేవల రంగంలోనూ ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది. 2014 నుంచి 2024 మధ్య సేవల వాణిజ్యం రెండింతలకు పైగా పెరిగి 2024లో €84.4 బిలియన్లకు చేరింది.

ఇక పెట్టుబడుల పరంగానూ ఈయూ-జీసీసీ సంబంధాలు బలంగా ఉన్నాయి. 2024 నాటికి జీసీసీ దేశాల్లో ఈయూ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల నిల్వ €163.1 బిలియన్లు కాగా, ఈయూలో జీసీసీ దేశాల పెట్టుబడుల నిల్వ €189.8 బిలియన్లకు చేరింది. ఈయూ-జీసీసీ సంబంధాలకు 1989లో కుదిరిన సహకార ఒప్పందం పునాదిగా ఉంది. ఆ ఒప్పందం ద్వారా ఆర్థిక సంబంధాలు, ఇంధనం, వాతావరణ మార్పులు, పర్యావరణం, పరిశోధన తదితర రంగాల్లో ఇరు పక్షాల మధ్య చర్చలు, సహకారానికి మార్గం ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com