ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా

- September 13, 2026 , by Maagulf
ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా

అమరావతి: అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న అమరావతి క్వాంటం బయో వ్యాలీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించింది. విజయవాడలో జరిగిన ఆరోగ్య శాఖ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఈ బయో వ్యాలీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక సాయం అందించేందుకు త్వరలోనే నిపుణుల బృందాన్ని అమరావతికి పంపుతామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్రమంత్రి కొనియాడారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.

సంజీవని ప్రాజెక్టుకు దేశవ్యాప్త ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంజీవని వైద్య ఆరోగ్య కార్యక్రమంపై కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజలకు ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడంలో ఈ పథకం అద్భుతంగా పనిచేస్తోందని ఆయన ప్రశంసించారు. ఈ సంజీవని విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు. వంటిల్లే ఫార్మసీగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం సంతోషకరమని పేర్కొన్నారు. వ్యాధులు రాకముందే నివారించుకునే జీవన విధానంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయత్వంలో రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం సంపూర్ణ సహకారం
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపుతున్న చిత్తశుద్ధిని కేంద్రమంత్రి ప్రశంసించారు. పోలవరం ఎడమ కాలువతో పాటు వెలిగొండ మరియు హంద్రీ నీవా ప్రాజెక్టుల ప్రారంభం రైతాజ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగం మరియు సాగునీటి వనరుల అభివృద్ధితోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన విశ్లేషించారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు అనుభవం ఎంతో కీలకమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సంయుక్త చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులోనూ ఏపీ అభివృద్ధికి కేంద్రం తరఫునుంచి అన్ని రకాల సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com