ఏపీ రాజధాని అమరావతి తొలిదశ ఎప్పటికి పూర్తవుతుంది?
- August 31, 2016
2018 కల్లా మొదటిదశ పూర్తిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం లక్ష్యాన్ని చేరుకోగలదా...? ఇప్పటికీ ప్రభుత్వ భవనాల డిజైన్లు కొలిక్కి రాకపోవడం, నిధుల విషయంలోనూ క్లారిటీ లేకపోవడంతో అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. సీఆర్డీఏ అధికారుల విదేశీ పర్యటనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. సీఆర్డీఏ అధికారుల తప్పటడుగులతో రాజధాని నిర్మాణం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి తొలిదశ నిర్మాణాన్ని 2018 కల్లా పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా... అది సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్ట్, రాజ్ భవన్ తో పాటు ఉద్యోగుల క్వార్టర్స్ మొదటి దశలో నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఈ నిర్మాణాలు 2018 నాటికి పూర్తికావడం సందేహంగానే ఉంది.
ప్రభుత్వ భవనాల డిజైన్ల కోసం గత నవంబర్ లోనే అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. జపాన్ కు చెందిన మాకీ అసోసియేట్స్ రూపొందించిన డిజైన్లను ఎంపిక చేసింది. అయితే మాకీ సంస్థ డిజైన్లు విద్యుత్ తయారీ కేంద్రాల్లోని చిమ్నీలను పోలి ఉండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్ .. దేశీయ సంస్థల నుంచి డిజైన్లను ఆహ్వానించింది. ఆ తర్వాత మలేషియా సంస్థ కూడా డిజైన్లను రూపొందించింది. వీటిలోనూ ఏ డిజైన్లను ఎంపిక చేయలేదు ప్రభుత్వం.
ఆంధ్రుల సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ భవనాలను నిర్మించాలనుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ఐకానిక్ డిజైన్ల కోసం 10 నెలలుగా కసరత్తు చేస్తున్నప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. తాజాగా మరోసారి రాజధాని నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు విదేశీ బాట పట్టారు అధికారులు. గతంలో సీఎం చంద్రబాబు పర్యటించిన ఆస్తానా, పుత్రజయ, టోక్యో, సింగపూర్ దేశాల్లో పర్యటిస్తోంది సీఆర్డీఏ బృందం. అక్కడి నగరాల నిర్మాణం, భవనాల డిజైన్లు, నిర్మాణం వంటి వాటిపై వచ్చే నెల 6 వరకూ అధ్యయనం చేయనుంది. ఇదే సమయంలో డిజిపి సాంబశివరావుతో పాటు మరికొంతమంది అధికారులు సింగపూర్ లో పర్యటించనున్నారు. అధికారుల విదేశీ పర్యటన తర్వాత డిజైన్ల పై మరోసారి నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.
మరోవైపు రాజధాని నిర్మాణానికి కావలసిన నిధుల సమీకరణ కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. హడ్కో,ప్రపంచ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చినప్పటికీ...మరింత స్పష్టత కోరుతున్నాయి. దీంతో డిజైన్లు, నిధులపై క్లారిటీ లేకపోవడంతో రాజధాని నిర్మాణాలు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది మొదటికి భవనాల నిర్మాణాలు ప్రారంభించాలనుకుంది ప్రభుత్వం.కానీ తాజా పరిస్థితి చూస్తుంటే నిర్మాణాల ప్రారంభం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







